గంగిరెడ్డిని అప్పగించండి: మారిషస్ కోర్టులో ఏపి పోలీసుల వాదనలు
హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని భారత్కు తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, గంగిరెడ్డిని అడ్డుకునేందుకు మరో వర్గం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలుమార్లు మారిషస్ వెళ్లి గంగిరెడ్డి నేరచరిత్రను అక్కడి కోర్టుకు వివరించిన ఏపీ పోలీసులు శుక్రవారం మరోసారి అక్కడి కోర్టులో వాదనలు వినిపించారు.
మారిషస్ కోర్టుకు ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు, తిరుపతి ఎస్పీ గోపీనాథ్ జెట్టి హాజరయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్, నకిలీ పాస్పోర్టు, బెదిరింపులు, హత్యాయత్నం, అక్రమాస్తులు సహా మొత్తం 27 కేసుల్లో నిందితుడైన గంగిరెడ్డిని తమకు అప్పగించాలని గట్టిగా వాదించారు.
గంగిరెడ్డి ఏపీ పోలీసులకు మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అని, ఎక్స్ట్రాడిషన్ లేదా డిపోర్టేషన్ మార్గంలో తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే నిందితుడి తరపు న్యాయవాది ఏపీ పోలీసుల వాదనలను తోసిపుచ్చారు. తన క్లయింట్ను భారతకు పంపిస్తే అక్కడి పోలీసులు చంపేస్తారని, ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని వాదించారు.
పన్నెండేళ్ల క్రితం అప్పటి ఏపీ ముఖ్యమంత్రిపై జరిగిన హత్యాయత్నం కేసులో గంగిరెడ్డిని ఇరికించారని, ఇప్పుడు అదే నాయకుడు ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నందున.. తన క్లయింట్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్నదని వాదించినట్లు తెలిసింది.
అయితే, ఈ వాదనని ఏపీ పోలీసుల తరఫున వెళ్లిన సీబీఐ న్యాయ సలహాదారు తోసిపుచ్చారు. భారతీయ చట్టాల ప్రకారమే నిందితులను కోర్టులు శిక్షిస్తాయి తప్ప, కాల్చి చంపాల్సిన అవసరం పోలీసులకు ఏముంటుందని అన్నారు.
నిందితుడు భారత్కు రాకుండా తప్పించుకోవడానికి ఇలాంటి పొంతనలేని వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. గంగిరెడ్డి నేరచరిత్రకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే సమర్పించినందున, అతన్ని భారతకు పంపాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న మారిషస్ కోర్టు తీర్పు వెలువరించాల్సిఉంది.
ఇది ఇలా ఉండగా, గంగిరెడ్డిని తప్పకుండా ఏపీకి తీసుకువస్తామని ఏపి డిజిపి రాముడు తెలిపారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ.. గంగిరెడ్డిపై చాలా కేసులున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదని అన్నారు.