అమరావతిపై కేంద్రం ఆలోచన అదేనా: ఢిల్లీకి సీఎం జగన్: అక్కడ స్పష్టత వచ్చిన తరవాతనే..!
ఏపీలో కొనసాగుతన్న రాజధాని తరలింపు..మూడు రాజధానుల ప్రతిపాదనల అంశంలో అందరూ కేంద్రం వైపు చూస్తున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేస్తుండటం.. జాతీ య స్థాయిలో ప్రభుత్వ ఆలోచనలను తప్పు బడుతుండటంతో..కేంద్రం వైఖరి ఏంటనే దాని పైన రాష్ట్ర ప్రభుత్వంలోనూ చర్చ సాగుతోంది. కేంద్ర పెద్దల అనుమతి లేకుండా ఏపీ బీజేపీ నేతలు దీక్షలు చేయరని .. ఇక్కడ అమరావతికి మద్దతుగా నిలవరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..తాను నేరుగా ప్రధాని మోదీ..అమిత్ షా ను కలిసి తమ ఆలోచనల వెనుక అసలు కారణాలు వివరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ వారంలోనే ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని
అమరావతికే బీజేపీ మద్దతు..!
ఏపీ ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని తరలించాలనే ప్రతిపాదన పైన ఏపీ బీజేపీ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయాణ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మౌన దీక్ష్ చేయగా..పార్టీ నేతలు రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దీనిని వ్యతిరేకంచటమే కాకుండా..తాజాగా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని నగరాన్ని వేరే చోటకు తరలించడానికి వీల్లేదని బీజేపీ అధిష్ఠానం స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు సమాచారం.
కమలనాధుల ఆదేశాలతోనే ఇక్కడ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని, దరిదాపుగా రూ.9 వేల కోట్ల పనులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అమరావతిలో రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే ఆయన శుక్రవారం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌనదీక్షకు కూర్చున్నారు. ఇక బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజధాని మార్పుపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర పెద్దలకు నివేదించే పనిలో ఉన్నారు. ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం రైతులు భూములిస్తే.. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చి అర్ధాంతరంగా రాజధానిని మార్చేస్తే.. ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనే భావనలో బీజేపీ అగ్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజధాని ప్రాంత రైతులు సైతం ప్రధాని మోదీ ఫొటోలతో నిరసనలు కొనసాగిస్తున్న విషయం కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా గమనిస్తోంది.
ఢిల్లీకి సీఎం జగన్..నేరుగా వివరణ
ఇదే సమయంలో..ఇతర పార్టీలతో పాటుగా బీజేపీ సైతం అమారవతి తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకించటం పైన వైసీపీ నేతలు ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం కమిటీల పేరుతో నిర్ణయం వాయిదా వేసినా.. కేంద్రం నుండి అభ్యంతరాలు లేకుండా చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం తానే స్వయంగా ప్రధాని మోదీ.. అమిత్ షా ను కలిసి ఈ నిర్ణయం వెనుక కారణాలను వివరించాలని భావిస్తున్నారు. అందు కోసం ఈ వారంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాజధాని పేరుతో జరిగిన అక్రమాలను వివరించటంతో పాటుగా.. మూడు రాజధానుల ప్రతిపాదనల గురించి సవివరంగా నివేదించాలని నిర్ణయించారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. దీంతో..ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో వచ్చే సంకేతాలు ప్రభుత్వ తదుపరి అడుగులకు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.