అమరావతిపై సోషల్ మీడియా వార్- సర్వేల పేరుతో పార్టీల హల్ చల్...
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఆసక్తి రేపుతున్న వేళ రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ గ్రూపులు, యువత సోషల్ మీడియా వార్ కు దిగాయి. అమరావతి రాజధానికి అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయి సర్వేలు చేపడుతున్నాయి. వీటితో తమకు అనుకూలమైన పద్ధతిలో సర్వే ప్రశ్నావళి తయారు చేసి జనం మీదకు వదులుతున్నాయి. వీటిలో భారీ ఎత్తున పాల్గొనాలని జనానికి తిరిగి అదే సోషల్ మీడియా గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నాయి.
వాస్తవానికి ఏపీలో ఏర్పాటు కానున్న మూడు రాజధానులపై ప్రభుత్వం కానీ విపక్షాలు కానీ ఇప్పటివరకూ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదు. కానీ తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు పలువురు రెఫరెండం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిపై రెఫరెండం నిర్వహిస్తే ఐదు కోట్ల మంది అనుకూలంగా ఓటేస్తారని టీడీపీ చెబుతుండగా.. మూడురాజధానులు వద్దని అమరావతి ఎవరూ కోరుకోవడం లేదంటోంది. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని సోషల్ మీడియాలో సర్వేలు చేపడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సర్వే మెసేజ్ లు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.
ఆగస్టు 6న అమరావతి రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిపై ఎప్పుడు ఏ తీర్పు వస్తుందో అన్న ఉత్కంఠ రేగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజాభిప్రాయాన్ని అమరావతికి అనుకూలంగా మలిచేందుకు సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కూడా ఈ సర్వేలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాశస్త్త్యాన్ని, ఆవశ్యకతను, అక్కడ జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ సాగుతున్న ఈ సర్వేలను వీలైనంతగా ఆర్గనైజ్ చేయడం ద్వారా ప్రజాభిప్రాయం తమవైపే ఉందని చెప్పుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.