2017 రౌండప్: పవన్కు అదే ప్లస్, జనసేనానితో జగన్ కార్నర్, బీజేపీ-టీడీపీ ఫైట్, 2019 ఆయుధం అదే!
అమరావతి: 2017లో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. టీడీపీ, బీజేపీ మధ్య పలు అంశాలపై రగడ, బీజేపీకి వైసీపీ అధినేత వైయస్ జగన్ దగ్గరవుతున్నట్లుగా కనిపించింది. అంతలోనే ఆ అంశం మాయమైంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ రంగాన్ని వదిలి రాజకీయ రణరంగంలోకి దూకుతానని ప్రకటించారు.
చదవండి: రాజ్భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)
చదవండి: నేనొస్తే వేరేలా: పవన్ హెచ్చరిక, ఇక్కడ పుట్టిన నీకు: రోజా ఘాటుగా, రంగంలోకి బండ్ల గణేష్!
ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ముందస్తు వచ్చినా రాకపోయినా దాదాపు మరో ఏడాదిన్నరలోగా సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. దీంతో 2017లో ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ ప్రకటనతో మరింత వేడి రాజుకుంది.
బీజేపీ-టీడీపీ మధ్య చిచ్చు, కలయిక
ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య ఉన్న మైత్రిపై అందరిలోను అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం.. ఇలా పలు అంశాలపై కొందరు నేతలు విమర్శలు గుప్పించుకుంటారు. అవి ఎలా అంటే అధికార, విపక్షాల మాదిరిగా దుమ్మెత్తిపోసుకుంటారు. ఆ తర్వాత పైస్థాయి నేతలు సర్దిచెప్పడంతో సైలెన్స్ అవుతారు. ఇది చాలా రోజులుగా సాగుతోంది. మరోవైపు కొద్ది నెలల క్రితం జగన్ ప్రధాని మోడీని కలిశారు. ఇది కూడా బీజేపీ-టీడీపీ మధ్య వాగ్యుద్ధానికి కారణమైంది. ఆ తర్వాత చల్లారింది. తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని టీడీపీ, బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు చెప్పినా అది నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు.
పవన్ పేరుతో జగన్ను కార్నర్ చేసేందుకు టీడీపీ
ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందు వైయస్ జగన్కు ఏమాత్రం ఊరట లభించలేదు. వరుసగా నేతలు అధికార పార్టీలో చేరుతున్నారు. అయితే జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమే. ఆయన పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ వైపు పాదయాత్ర చేస్తుండగానే నేతలు టీడీపీలో చేరడం ఆ పార్టీకి జీర్ణించుకోలేని పరిణామం. మోడీని కలిసిన తర్వాత బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపించింది. దీంతో ఆయన హోదా విషయంలో బీజేపీపై విమర్శలు చేయలేదు. పైగా తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న హామీని నిలబెట్టుకోలేదు. చివరకు బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపించినా దూరంగానే ఉన్నారు. అంతే కాకుండా పవన్ సమస్యలపై చిత్తశుద్ధితో స్పందిస్తూ ప్రభుత్వాన్ని కదిలిస్తున్నారని, జగన్ మాత్రం రాజకీయ లబ్ధి కోసం ప్రతి అంశాన్ని సమస్యగా మారుస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పై ఆయుధాలతో జగన్ను కార్నర్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు.
అందరు నాయకుల్లా కాకుండా
2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి అండగా నిలిచారు. తాను మద్దతు పలికిన ప్రభుత్వాలు తప్పు చేసినా ప్రశ్నిస్తానని ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ చేశారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై రాజకీయ నాయకుడిలా కాకుండా సమస్య పరిష్కారం కృషి చేసే ఆదర్శ నాయకుడిలా స్పందిస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ కొత్త ఒరవడి, వారికి అతీతం
సమస్యల పరిష్కారం విషయంలో ఓ విధంగా పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ రంగంలో ఒకింత కొత్త ఒరవడిని తీసుకు వచ్చారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇతర పార్టీలు ప్రతి అంశానికి రాజకీయ రంగు పులిమి, తమ పార్టీకి లబ్ధి చేకూరేలా పని చేస్తాయని, పైగా అధికారం కోణంలో సమస్యల పరిష్కారంపై ఎక్కువగా దృష్టి పెడతాయని భావిస్తారు. కానీ పవన్ వీటికి అతీతం అని చెబుతున్నారు.
సమయం చూసుకున్న పవన్ కళ్యాణ్
ఇక, 2014 ఎన్నికలకు ముందు పార్టీ స్థాపించినప్పటికీ ఆయన అప్పుడప్పుడు సమస్యలపై ప్రశ్నించడం మినహా జనసేన పార్టీ బలోపేతం కోసం పని చేయలేదు. కానీ పవన్ ఇక రాజకీయ రణరంగంలోకి దూకనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉంది. ఇలాంటి సమయంలో ఆయన సమయం చూసుకొని, తన సినిమాలన్నింటిని పూర్తి చేసి జనసేన బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు.
లెక్కలు తీస్తున్న బాబు, జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్న నేపథ్యంలో ఆయన రాకతో తమకు ఎంత నష్టం, ఎంత లాభం అని లెక్కలు వేసుకునే పనిలో ఏపీలోని అధికార, విపక్షాలు పడ్డాయి. ఇప్పటికే జనసేన బలం, పవన్ రంగంలోకి దిగాక.. ఎక్కడ ఏమేరకు ప్రభావితం చేస్తారని వివరాలు సేకరిస్తున్నారని ప్రచారం సాగింది.
ప్రత్యేక హోదానే అందరి ప్రధాన ఆయుధం
విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన ఆయుధంగా మారనుంది. హోదా బదులు ప్యాకేజీ ఇస్తున్నామని బీజేపీ, హోదాకు సమానమని చెప్పినందువల్లే అంగీకరించామని టీడీపీ చెప్పింది. కానీ వైసీపీ మాత్రం ససేమీరా అంటోంది.
జగన్కు అదే మైనస్, పవన్ కళ్యాణ్కు అదే ప్లస్
అయితే, ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు సరిగా లేదనే వాదనలు ఉన్నాయి. హోదా ఇవ్వాల్సింది బీజేపీ అని దానిని ఒక్క మాట అనకుండా చంద్రబాబునే పదేపదే విమర్శించడం సరికాదంటున్నారు. బీజేపీని అనకుండా బాబును అనడం అది మైనస్ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో దానికి సమానమైన ప్యాకేజీ అని బీజేపీ-టీడీపీలు చెబుతున్నాయని, అది ఎలాగో ప్రజలకు వివరించాలన్నారు. పవన్ వ్యాఖ్యల్లో ఓ స్పష్టత కనిపిస్తోందని చెబుతున్నారు.
రాజధాని డిజైన్లపై ఊగిసలాటకు చెక్!
విభజన నేపథ్యంలో ఏపీ రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని తుది డిజైన్ల కోసం ప్రజలు మూడేళ్లుగా వేచి చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే డిజైన్లు తుది రూపు దాల్చుతున్నాయి. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంతకుముందు పలుమార్లు డిజైన్లపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.