ఏపీ లో ఇవే మా రాజకీయాలు..! దబాయింపు రాజకీయాలు..!!
రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, కోపాలు, తిట్లు, దాబాయింపులు అన్నీ సహజం. అదికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు నిత్యం చేసే పనే ఇది. కాని ఏదేనా అంశం ప్రజలకు తెలియకుండా, వెలుగులోకి రాకుండా ఉన్నంత వరకు మభ్య పెడుతూ, ప్రశ్నిస్తున్న వారిని దబాయిస్తూ ఉంటే చెల్లిపోతుంది. కాని విషయం ప్రజలదాకా వచ్చి, అంశం తేటతెల్లమైనప్పటికి దాని గురించి అభూత కల్పనలు కలిగించడం, దాబాయించడం ఎంతవరకు సమంజసం..?
ప్రస్తుత ఏపిలో బీజేపి నాయకుల పరిస్థితి అచ్చు ఇలాగే ఉంది. కేంద్రంలో ఉన్న బీజెపి ఏపి పట్ల ఎంత కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఏపి ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయినప్పటికి., కేంద్ర ప్రభుత్వాన్ని వెలనకేసుకొచ్చే ప్రయత్నం చేయడం ఏపి బీజేపి నాయకుల మూర్ఖత్వం కాక ఇంకేమౌతుంది..? అందులో కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి లాంటి నాయకురాలు ఏపి ప్రభుత్వానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీయాల్సింది పోయి వెనకేసుకురావడం, ప్రభుత్వాన్ని దబాయిండం విచిత్రంగా అనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలను దబాయిస్తూ లబ్ది పొందాలనుకుంటున్న బీజెపి నాయకులు రేపు ప్రజలను దబాయించి ఓట్లు పొందుతారా అనేదే సందేహంగా మారుతోంది.
దాబాయిస్తాం..! భ్రమింప జేస్తాం..!! అడిగింది మాత్రం ఇవ్వం..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలో భారతీయజనతా పార్టీ నాయకులకు ఇప్పుడు పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న. అయితే ఎన్ని వంచనలు చేసినా సరే, నిర్భయంగా ప్రజల ముందుకు వచ్చేసి, ప్రజల వాదనతో సంబంధంలేకుండా, పొంతన లేకుండా తమకు తోచిందల్లా దబాయించి మాట్లాడేసి నెగ్గుకు రాగల ఘనాపాటి నాయకులు కూడా కొందరు భాజపాకు ఏపీలో ఉన్నారు. అలాంటి వారి వరుసలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పేరును ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ వంచనల విషయంలో కూడా ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో వారి ముందు ఏం మాట్లాడాలో, రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడానికి సంబంధించి తప్పు తమది ఎంత మాత్రమూ కాదని, చంద్రబాబునాయుడుది మాత్రమేనని ఏ రకంగా విషయాన్ని వక్రీకరించి చెప్పాలో దగ్గుబాటి పురందేశ్వరి మాటలే స్పష్టం చేస్తున్నాయి. పైగా పురందేశ్వరి మాటలు ఏపీలోని భాజపా నాయకులకు ఇండైరక్టుగా ట్రైనింగ్ క్లాసుల్లాగా ఉపయోగపడుతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.
నైతికత కోల్పోయిన చిన్నమ్మా..! రాజకీయ ప్రయోజనాలే కానీమ్మా..!!
చిన్నమ్మ అలియాస్ పురందేశ్వరి తన వైఫల్యాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రశ్నించే ప్రజల్ని మీడియాను దబాయించి మాట్లాడేయడంలో దిట్ట. తాను కేంద్రమంత్రిగా ఉండగా సమైక్యాంధ్రకు అనుకూలం అంటూనే మరి అందుకోసం రాజీనామాలు చేస్తారా? అంటే పదవిని వదులకోవడానికి సుతరామూ ఇష్టపడకుండా అర్థం పర్థం లేని పెడర్థాలతో అడ్డగోలుగా మాటలు పేర్చి, అందరినీ దబాయించి పారేసిన అనుభవం ఆమెకు పుష్కలంగా ఉంది. ఆ అనుభవంతోనే ఏపీలో భాజపాలో చేరిన తర్వాత చంద్రబాబునాయుడునుచీటికి మాటికీ చికాకు పెడుతూ ఆడిపోసుకుంటూ రోజులు వెళ్లదీస్తోంది.
లోటు బడ్టెట్ లో ఉన్న రాష్ట్రానికి లేదు చేయూత..! ఒట్టి కూతలే..!!
తాజాగా రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంపై ఇక్కడి ప్రభుత్వం నుంచి డీపీఆర్ లతో కూడిన ఒక్క ప్రతిపాదన కూడా లేకపోవడం వల్లనే కేటాయింపు సాధ్యం కాలేదని వంత పాడుతోంది. అంటే ఆమె ప్రకారం, నిధులు రాకపోవడానికి నిందితుడు బాబే అన్నమాట. అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణాల విషయంలో డీపీఆర్ లు ఇంకా తయారు కాలేదనే అనుకుందాం..! మరి జాతీయ ప్రాజెక్టు అయినా.. పనులు సగంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు సంగతేమిటి చిన్నమ్మా అని జనం అడుగుతున్నారు. పోలవరం అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్న వ్యవహారం. దానికి గడువులోగా పూర్తి చేయడానికి ఇంకా 44 వేల కోట్లు కావాలి. గడువు 2018 సంవత్సరాంతం అంటున్నారు.
నేతలను దబాయిస్తే ఓకే..! రేపు ప్రజలను దబాయిస్తే ఏమౌతుందో తెలియాలి మీకే..!!
ఇంత చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కరూపాయైనా విదిలించలేదేంటనే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన డీపీఆర్ లు కాట్రాక్టర్లతో ఒప్పందాలు, పనుల అప్పగింతలూ.,అన్నీ కేంద్రం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కదా..! దానికి కూడా రిక్తహస్తం ఎందుకు చూపినట్లు అనే ప్రశ్న ప్రజలనుంచి వస్తోంది. ఇవన్నీ బీజేపి నాయకులు సమాధానం చెప్పలేని ప్రశ్నలు. మరి వారు ప్రజల ఆగ్రహాన్ని ఎలా తట్టుకుంటారో ఎలా మనుగడ సాగిస్తారో చూడాలి. బీజేపి నేతలు తెలుగుదేశం నాయకులతో పాటు చంద్రబాబును దబాయిస్తున్నారు సరే.. రేపు ఎన్నికల్లో కూడా ప్రజలను దబాయించి ఓట్లు వేయించుకుంటారా..! చూడాలి.