జగన్ అపరిపక్వతే: కానీ ఫిరాయింపు మంత్రుల మాటేమిటి?
ఎటువంటి శిక్ష వేయాలంటూ జగన్మోహన్రెడ్డి ప్రతీకాత్మకంగా చేసిన ఓ చిన్న వ్యాఖ్యను పట్టుకుని ఆయనను లక్ష్యంగా చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలకు దిగడం అంతా ప్రణాళిక, వ్యూహం ప్రకారమే కింది న
హైదరాబాద్/ అమరావతి: మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గురువారం నంద్యాలలో జరిగిన జగన్ బహిరంగ సభ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులను కకావికలం చేసింది.
వైఎస్ జగన్ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన అశేష జనాన్ని చూసి అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు మతి పోయింది. సీఎం చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ పలు రకాల మోసాలకు పాల్పడిన వ్యక్తిని ఏం చేయాలని, ఎటువంటి శిక్ష వేయాలంటూ జగన్మోహన్రెడ్డి ప్రతీకాత్మకంగా చేసిన ఓ చిన్న వ్యాఖ్యను పట్టుకుని ఆయనను లక్ష్యంగా చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలకు దిగడం అంతా ప్రణాళిక, వ్యూహం ప్రకారమే కింది నుంచి ఉన్నతస్థాయి వరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే, సీఎంగా ఉన్న నారా చంద్రబాబును తగులబెట్టాలని వైఎస్ జగన్మోహన రెడ్డి పిలుపునివ్వడం సరి కాదని చెప్పక తప్పదు. రాజకీయ విజ్నులెవ్వరూ హర్షించరు. కానీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగిన వారిని కట్టడి చేయడం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు సమాధానం చెప్పేదెవరని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఫిరాయింపు దారుల రాజీనామాలెక్కడ?
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అపరిపక్వతతో చేసిన వ్యాఖ్యల సాకుగా తెల్లవారే సరికే రాష్ట్రవ్యాప్తంగా ఎదురుదాడి చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకే చెల్లు. ఇక నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వార్తలు ప్రచురిస్తున్నామని, ప్రసారం చేస్తున్నామని చెప్పుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీకి అనధికార అనుబంధ మీడియా సంస్థలు వార్తలు ప్రసారాలు చేశాయి, వార్తలు ప్రచురించాయి.ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుని చంద్రబాబు వారి చేత రాజీనామా చేయించలేదు. సరి కదా అందులో నుంచే పలువురికి తన క్యాబినెట్లో చోటు కల్పించారు. అందులో ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక బాధ్యతలను తన భుజస్కందాలపైకి ఎత్తుకున్న ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఫిరాయింపులకే టీడీపీ ప్రాధాన్యం.. ప్రజా సమస్యలు పట్టని సర్కార్
నవ్యాంధ్ర నిర్మాణం కోసమే తాము అధికార తెలుగుదేశం పార్టీలో చేరామని మంత్రులుగా ప్రమాణం చేసిన వారు చెప్తున్నారు. అంతే కాదు వైఎస్ జగన్ పనికి రాని వాడని చెప్తున్నారు. అదే సమయంలో రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలోకి చేరిన ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేసి, తాజాగా ప్రజాతీర్పు పొందాల్సి ఉంటుంది. కానీ ఆధిపత్య రాజకీయాలే పరమావధిగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందుకు సుముఖంగా లేదు. కానీ అధికార తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్న ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డితో జగన్మోహన్రెడ్డి రాజీనామా చేయించి ఆ తర్వాతే పార్టీలో చేర్చుకోవడం ద్వారా నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు తెర తీశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి తన ప్రసంగంలో అన్ని విషయాలనూ వివరిస్తూ ఇంత దుర్మార్గమైన పరిపాలనను అందిస్తున్న చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడికి దిగడం ఆశ్చర్యకరమైన విషయమేం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులపై ఇలా తెలుగు తమ్ముళ్లు
2014 నుంచి .. అంతెందుకు.. 2009లో రాజకీయాల మాటెలా ఉన్నా.. విభేదాలెలా ఉన్నా.. ప్రజలందరి నేతగా పేరు తెచ్చుకుని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ చేయని రాజకీయం లేదు. 2014 ఎన్నికలకు ముందు నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాధినేతతో కలిసి కుట్ర కేసులు బనాయించడం మొదలు.. వాటి ఆసరాగా జైలుకెళ్లి వచ్చిన ఖైదీ అని దుమ్మెత్తిపోయడం తెలుగు తమ్ముళ్లకు అలవాటుగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో పాదయాత్ర ప్రకటన చేస్తే రాష్ట్ర మంత్రులు మొదలు తెలుగు తమ్ముళ్లు కూడా వైఎస్ జగన్మోహన రెడ్డిని తలో రకంగా విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి వారానికోసారి కోర్టుకు వెళ్లి వచ్చే వాడని, దొంగ అని, దోపిడీ దారు అని, అతడికి జైలువారం అని రకరకాల వ్యాఖ్యలతో ఎదురు దాడికి దిగిన నేపథ్యం తెలుగు తమ్ముళ్లది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరిస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తీరు మారెదెలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
మాయదారి హామీలతో బాబు ఇలా పాలన
తమిళనాడులో జల్లికట్టు ఆట ఆడేందుకు అనుమతించాలని కోరుతూ తమిళులు భారీ ఉద్యమం చేపట్టినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై విశాఖపట్నం నగరంలోని రామక్రుష్ణ బీచ్ వద్ద నిరవధిక ఆందోళన చేపట్టేందుకు పూనుకున్న యువతను ఎక్కడికక్కడ అడ్డుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ తదితరులను విశాఖ విమానాశ్రయంలోనే నిలిపేసిన నేపథ్యం ఈ ప్రభుత్వానిది. తాము చేసేదే గొప్ప అనే ప్రచారంతో తిమ్మిని బమ్మిని చేయడంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వైఎస్ జగన్ దూకుడు అంటే మంటగానే ఉంటుంది. ఇంటికొకరికి ఉద్యోగం కల్పిస్తామని నాడు టీడీపీ అధినేతగా చంద్రబాబు హామీలు గుప్పించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆరు నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్ హామీ అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం వంటి వారు ఆందోళనకు దిగితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దాని వెనుక జగన్ ఉన్నాడన్న ముద్ర వేస్తున్నారు. ఆవేశంలో చేసిన వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు ఉన్మాది అని.. మాయదారి హామీలతో ప్రజలను మభ్యపెట్టే సీఎం చంద్రబాబుకు అనుభవజ్ణుడని బిరుదు పెట్టారు.
ఇచ్చిన హామీల అమలు దాటవేత ఏపీ సీఎం స్టయిల్
మూడోసారి సీఎంగా బాద్యతలు స్వీకరించిన తర్వాతైనా చంద్రబాబు నాయుడు ప్రజాభిమతానికి అనుగుణంగా పాలన సాగిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎవరూ ఆమోదించరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆచరణలో గతంలో మాదిరిగానే అధికారులపై హుంకరింపులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులను నిలదీసిన అధికారులకు మందలింపుల వరుస మాత్రం మారలేదు. అవినీతి పట్ల చండశాసనుడిగా వ్యవహరిస్తానని ప్రకటిస్తున్నా.. ఆచరణలో పలు పథకాలు తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నాయన్న విమర్శలతో కూడిన వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక కర్నూల్ జిల్లా పరిధిలోని నంద్యాలను జిల్లా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ కలను సాకారం చేస్తానని జగన్ హామీ ఇవ్వడంతో జనంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైశ్యులు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమ డిమాండ్ను నెరవేర్చడానికి జగన్ ముందుకు రావడంతో ఆ వర్గాలలో ఆనందం వ్యక్తమౌతోంది. ఇదిలా ఉంటే అధికార తెలుగుదేశం పార్టీ నుంచి విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక ఎమ్మెల్సీగా శిల్పాచక్రపాణి రెడ్డి చేరడం ఆసక్తి కర పరిణామం. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం దిశగా పారదర్శకంగా వ్యవహరించాలే తప్ప.. దాటవేత రాజకీయాలు, విధానాలు, అనైతిక పద్దతులు ఎంత మాత్రమూ సరి కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.