టీడీపీ - జనసేన పొత్తు పై కేసీఆర్ బ్రహ్మస్త్రం : డైలమాలో కాపు నేతలు..!?
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ బ్రహ్మస్త్రం ప్రయోగానికి సిద్దమయ్యారు. కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో టీడీపీ- జనసేన పొత్తు ఖరారు అవుతున్న వేళ కేసీఆర్ అదును చూసి తన అమ్ముల పొది లోని అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రకటన గురించి తెలుసుకున్న కాపు నేతలంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. డైలమాలో పడ్డారు. మరి కొద్ది రోజుల్లో ఏపీలో పర్యటనకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఏపీ కేంద్రంగా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సమావేశమైన కాపు నేతల్లో కేసీఆర్ నిర్ణయమే ప్రధాన అజెండాగా మారింది. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.
పార్టీలకతీతంగా కాపు నేతల సమావేశం..
హైదరాబాద్ కేంద్రంగా కాపు నేతలు సమావేశమయ్యారు. గతంలోనూ ఇటువంటి సమావేశాలు జరిగినా..ఈ సారి బీఆర్ఎస్ లో చేరిన ఏపీకి చెందిన ముఖ్య నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీఆర్ఎస్ లో తాము చేరటం వెనుక కారణాలను వివరించారు. కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్ధసారధి, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తో పాటుగా ఏపీకి చెందిన కాపు నేతలు హాజరయ్యారు. కాపులకు కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత.. ఏపీలో టీడీపీ - జనసేన పొత్తుతో మారే సమీకరణాలు.. కాపులకు రాజకీయంగా జరిగే మేలు గురించి ఇందులో ప్రధానంగా చర్చించారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కే విధంగా నడుచుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ తో చర్చ ఒక్క సారిగా మారిపోయింది. కేసీఆర్ నిర్ణయంతో నేతలంతా ఆలోచనలో పడ్డారు.
ఏపీకి కాపు సీఎం..కేసీఆర్ హామీ
ఏపీలో బీఆర్ఎస్ కొత్త నినాదంతో ముందుకు వస్తోంది. ఏపీలో కాపు నేతే ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ తమకు హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు కాపు సమావేశంలో ఇతర నేతలకు వివరించారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ గురించి విశ్లేషించారు. కాపులకు ప్రాధాన్యత దక్కేలా తాము కేసీఆర్ తో చేస్తున్న చర్చల గురించి వివరించారు. ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే..కాపుల న్యాయపరమైన రాజకీయ డిమాండ్ల పైన కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని బీఆర్ఎస్ నేతలు వివరించారు. త్వరలోనే ఏపీలో కేసీఆర్ వరుస పర్యటనలు..సభలు జరగనునున్నట్లు వెల్లడించారు. ఏపీ పర్యటనలోనే కేసీఆర్ కాపులకు సీఎం నిర్ణయాన్ని ప్రకటిస్తారని బీఆర్ఎస్ నేతలు వివరించినట్లుగా తెలుస్తోంది.
టీడీపీ - పొత్తు..కాపు నేతలు ఎటు
రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలే అధికార పీఠం పైన కూర్చుకుంటున్నారని..ఇతరకు అవకాశం రాదా అంటూ పలువురు కాపు నేతలు చాలా కాలంగా ప్రశ్నిస్తున్నారు. పవన్ ను సీఎం చేయాలని హరి రామ జోగయ్య లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ - జనసేన పొత్తు వేళ పవన్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశాలు కనిపించటం లేదు. ఇప్పటి వరకు కాపు నేత సీఎం కావాలని కోరుకున్న కాపు నేతలు..బీఆర్ఎస్ తాజా నిర్ణయం తో ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు కాపు నేతల భేటీలో చర్చ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనుంది. బీఆర్ఎస్ కాపు సీఎం నినాదం తో ముందుకు వచ్చినా..ఏపీలో ఏ మేర ఆదరణ ఉంటుందనే చర్చ కొనసాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం పైన కేసీఆర్ ఏపీ పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.