బీజేపీకి అనుకూలంగా ఏపీ పాలిటిక్స్- టీడీపీ స్ధానం భర్తీ చేస్తుందా ? చతికిలపడుతుందా ?
ఏపీలో గత కొన్ని దశాబ్దాలుగా తోక పార్టీగా మిగిలిపోయిన బీజేపీ మారిన పరిస్ధితుల్లో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు ఆ పార్టీకి కొత్త ఊపిరిలూదేలా ఉన్నాయి. తాజాగా బాధ్యతలు చేపట్టిన సో్ము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే 2024 నాటికి రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదగాలన్న ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష నెరవేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే టీడీపీ మిగిల్చిన రాజకీయ శూన్యాన్ని కూడా కాషాయ పార్టీ భర్తీ చేసే అవకాశాలూ లేకపోలేదు.
బీజేపీకి అనుకూలంగా రాజకీయం..
ఏపీలో బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా అనుకూలమైన రాజకీయ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీకి తోక పార్టీగా ఉంటూ వాజ్పేయ్ హయాంలో ఓసారి, మోడీ హయాంలో మరోసారి కొన్ని ఓట్లు, సీట్లు గెల్చుకున్న బీజేపీ.. ఈసారి మాత్రం జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ స్వతంత్ర పార్టీగా ఎదిగేందుకు తగిన అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నంలో ఉంది. గతంలో ఓ సామాజిక వర్గం చేతుల్లో ఉండిపోయి ఎదుగూబొదుగూ లేకుండా సాగిన బీజేపీ ప్రస్ధానం తాజా మార్పులతో స్వేచ్ఛగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు అజెండా ఫాలో అవుతూ చివరికి ఆయన ఆగ్రహానికి గురై జనంలోనూ పలుచన అయిన బీజేపీ ఇప్పుడు స్వతంత్ర నిర్ణయాలతో అవకాశాలు సృష్టించుకుంటోంది.
కలిసొస్తున్న పరిస్ధితులు..
గత ప్రభుత్వాల హయాంలో సున్నితమైన మతపరమైన అంశాల్లో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కారు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే ఇప్పుడు బీజేపీకి కలిసివస్తోంది. ముఖ్యంగా టీటీడీ భూముల వ్యవహారం, గుంటూరులో ముస్లిం యువకులపై కేసుల ఎత్తివేత వంటి వైసీపీ సర్కారు నిర్ణయాలు బీజేపీకి ఓ అజెండా ఇచ్చాయి. తాజాగా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావడంపైనా బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. అటు సింహాచలం దేవస్ధానంలో జరుగుతున్న పరిణామాలు కూడా బీజేపీకి వరంగా మారాయి. ఇలా ఒకే సమయంలో ఇన్ని అంశాలు బీజేపీ అజెండాలోకి వచ్చి చేరాయి. దీంతో వీటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్వీట్లు చేస్తూ బీజేపీ నేతలు హల్చల్ చేస్తున్నారు.
టీడీపీ కంటే దూకుడుగా...
వాస్తవానికి ఏపీలో 23 సీట్లతో ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీకి ఇవే అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉంది. కానీ అతిగా స్పందిస్తే ఓ వర్గం ఓట్లు దూరమవుతాయేమో అన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. సరిగ్గా ఇదే అంశాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మల్చుకుంటోంది. మతపరమైన అజెండాతో పాటు సున్నితమైన అంశాలపై ఏ చిన్న అవకాశం దొరికినా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో బీజేపీ విమర్శలకు వైసీపీ నేతలు స్పందించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే అదనుగా బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని మతపరంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాన్ని సైతం మతంతో ముడిపెడుతూ న్యాయపోరాటం చేస్తున్న బీజేపీ నేతలు.. మరిన్ని అంశాలపై కోర్టుల్లో కేసుల దాఖలుకు సిద్దమవుతున్నారు.
విశాఖ కేంద్రంగా రాజకీయాలు..
ఏపీ మూడు రాజధానుల్లో భాగంగా ప్రధానమైన కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖ నగరంలో బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడల్లా బీజేపీ అక్కడ మెరిసింది. 2014లో టీడీపీ మద్దతుతో ఇక్కడ కంభంపాటి హరిబాబును ఎంపీగా గెలిపించుకున్న బీజేపీ.. తాజాగా అక్కడి ఉత్తరాది ఓటు బ్యాంకుపై దృష్టిపెడుతోంది. రాజధానిగా మారిన పరిస్ధితుల్లో టీడీపీ కంటే ముందుగా వారిని ఆకట్టుకునేందుకు తమకు మంచి అవకాశాలు ఉన్నాయని బీజేపీ నమ్ముతోంది. అందుకే గంటా వంటి సీనియర్ నేతలను పార్టీకి ఆకర్షించడం ద్వారా ఇక్కడ నాయకత్వ లోటును భర్తీ చేసుకోవాలని కూడా యోచిస్తోంది. తగిన హామీ లభిస్తే గంటాతో పాటు ఆయన వర్గం నేతలు బీజేపీలో చేరిపోయేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విశాఖ రాజధాని కేంద్రంగా బీజేపీ రాజకీయం రాటుదేలడం ఖాయం. అదే సమయంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీ స్ధానాన్ని విశాఖలో బీజేపీ భర్తీ చేసినా ఆశ్చర్యం లేకపోవచ్చు.