ఎపి:త్వరలో రాష్ట్రంలో పోస్టల్ బ్యాంకులు...మినిమం బ్యాలెన్స్ బాధ ఉండదు!
అమరావతి:పోస్టాఫీసులు అంటే కేవలం ఉత్తరాల బట్వాడా అనే కాలం పోయి పొదుపు పథకాలు, డిపాజిట్ల వరకూ వాటి సేవలు విస్తరించిన సంగతి తెలిసిందే...అయితే అవే పోస్టాఫీసులు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బ్యాంకులుగాను రూపాంతరం చెందబోతున్నాయి.
పైగా సాధారణ బ్యాంకుల్లో ఛార్జీల మోతతో బేజారెత్తుతున్న ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థకు ఏదైనా మంచి ప్రత్యామ్నాయం దొరికితే బాగుండు అని ఆశగా నిరీక్షిస్తున్నారు. నోట్ల రద్దు తరువాత ఈ ఎదురుచూపులు ఇంకా ఎక్కువకాగా...సరిగ్గా ఇదే మిక్కిలి అనుకూల సమయం అనుకుంటూ పోస్టల్ శాఖ బ్యాంకింగ్ రంగంలోకి కాలుమోపింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ)...త్వరలోనే మన రాష్ట్రంలోనూ బ్రాంచీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఈ సేవలు అందిస్తున్న ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ)...త్వరలో ఎపిలోనూ బ్రాంచీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. తమ పోస్టల్ బ్యాంకుల ఏర్పాటుకు సహకరించాలని ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఐపీపీబీ తమ బ్యాంకు శాఖలను దేశవ్యాప్తంగా కనీసం 650 ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రతి జిల్లాకు కనీసం ఒక బ్యాంకుకు అవకాశం ఉంటుందని తెలిసింది. అదే సమయంలో మరో 3,250 పోస్టాఫీసులు ఈ బ్యాంకులకు యాక్సెస్ పాయింట్లుగా ఉంటాయి.
మన రాష్ట్రంలో ఏర్పాటుచేసే పోస్టల్ బ్యాంకుల్లో కూడా ఇతర వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న సేవలతో పాటు అదనంగా మరికొన్ని సేవలూ అందిస్తారట. సేవింగ్స్, కరెంటు ఖాతాల ప్రారంభం, మొబైల్, ఈ-మెయిల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు సేవలు...ఇత్యాది బ్యాంకింగ్ సేవలన్నీ ఉంటాయి. అంతేకాదు వీటికి అదనంగా ఇంటికే బ్యాంకింగ్ సేవలు అన్న కొత్త విధానాన్నీ పోస్టల్ శాఖ తీసుకుంటోందని తెలిసింది. ఆ ప్రకారం టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు అధికారులు ఇంటికే వస్తారు.
పైగా పోస్టల్ బ్యాంకుల్లో కొత్త ఖాతాలను ఉచితంగా...అంటే జీరో ఓపెనింగ్ బ్యాలన్స్తో ప్రారంభించే సదుపాయం కూడా ఉంది. పైగా ఆయా ఖాతాల్లో కనీస నిల్వ ఉండాలన్న నియమం కూడా ఏమీ ఉండదని తెలిసింది. ఫలితంగా మినిమం బ్యాలన్స్ చార్జీలు విధించడాలు వంటివి కూడా ఉండవు. మిస్డ్ కాల్ ఇస్తే ఖాతాల వివరాలు, బ్యాలన్స్లను సదరు ఖాతాదారుకు పంపించే ఏర్పాటు కూడా ఐపీపీబీ చేసింది. అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాలను పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలతోనూ అనుసంధానం చేస్తారట. ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్ము నుంచి అవసరమైన బిల్లుల చెల్లింపును ఈ ఖాతా ద్వారా ఆన్లైన్లో చెల్లించే సౌకర్యం కల్పిస్తారు.