బాబుకు 'ప్రెస్ అకాడమీ' షాక్: చేసిందేమి లేదు!, జర్నలిస్టుల పరిస్థితి ఇదిగో ఇలా?
ఏపీలో టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా.. ప్రెస్ అకాడమీ పట్ల మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తాజాగా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు
అమరావతి: ఏపీలో టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా.. ప్రెస్ అకాడమీ పట్ల మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తాజాగా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ దుస్థితి గురించి, ప్రభుత్వ అలసత్వం గురించి ఒక సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయిపోయినా.. ఇంతవరకు ప్రెస్ అకాడమీకి సొంత భవనం కేటాయించేలేదని ఆయన గుర్తు చేశారు. భవనం కోసం 6వేల అడుగుల స్థలం కావాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరామని, ఇంతవరకు వారి నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. ప్రెస్ అకాడమీకి సొంత భవనమే కాదు, సొంత సిబ్బంది కూడా లేరని చెప్పారు.
చివరకు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా తన పరిస్థితి ఎలా అయిందో వివరించారు. బ్రీఫ్ కేసే తన ఆఫీసుగా మారిపోయిందని చెప్పారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగానే ప్రెస్ అకాడమీకి ఈ దుస్థితి తలెత్తిందా? అన్న ప్రశ్న లేవనెత్తిన ఆయన.. జర్నలిస్టులతో పాటు ప్రజల్లోను ఇదే ప్రశ్న మెదులుతోందన్నారు.
ప్రెస్ అకాడమీ ఒక యూనివర్సిటీ లాంటిదని, తాను అందులో వీసీ లాంటి వాడినని దీక్షితులు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన 140అంశాల్లో ప్రెస్ అకాడమీ కూడా ఒకటని గుర్తుచేశారు. రచన జర్నలిస్టుల ఉద్యోగం రోజువారీ రెన్యువల్ బేస్ గా దిగజారిందని జర్నలిజం కాలేజీ ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావు అన్నారు.
తెలంగాణతో పోల్చితే ఏపీలో జర్నలిస్టులకు తక్కువ ప్రాధాన్యత:
తెలంగాణ సర్కార్ జర్నలిస్టుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఏపీ జర్నలిస్టులు కూడా అలాంటి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో సగం కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణతో పోల్చితే ఏపీలో జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల ఆవేదనను సీఎం చంద్రబాబు అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు.