ఎపి:రాష్ట్రంలో నిరసనల హోరు...మంగళగిరిలో ఉద్రిక్తత;రేపు మరికొన్ని సంఘాల ఆందోళన
గుంటూరు:ఎపిలో వివిధ సంఘాలు సమస్యల పరిష్కారం కోసం నిరసనల బాట పట్టాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
నిరసనలో భాగంగా పారిశుధ్య కార్మికుల సమ్మెకు దిగడంతో వారికి బదులుగా టిడిపి కార్యకర్తలు రోడ్లు ఊడ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని కార్మికులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలో భాగంగా దివ్యాంగులు అర్ధ శిరోమండన కార్యక్రమం, అలాగే గౌరవ వేతనం కోసం ఆశావర్కర్లు,ఖాళీల పెంపు కోసం హిందీ పండిట్లు మంగళవారం ఆందోళనలకు దిగనున్నారు.
ఉద్రిక్తత...ఎందుకంటే?...
మంగళగిరిలో సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన పారిశుధ్య కార్మికులకు బదులుగా రోడ్లు ఊడ్చేందుకు టిడిపి కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే వీరిని పారిశుధ్య కార్మికులు నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దివ్యాంగులు...అర్ధ శిరోమండనం
ఇక మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ నెల 9వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో దివ్యాంగులు చేపట్టిన అర్ధ శిరోమండన కార్యక్రమంకుతాము సమాయత్తమవుతున్నట్లు రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగ సోదర సోదరీమణులు ఈ విషయాన్ని గమనించాలని, ఆందోళనలో పాల్గొనేందుకు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. దివ్యాంగుల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం నెరవేర్చనందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
ఆశా వర్కర్లు...రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
ఇక ఇదే మంగళవారం రోజు ఆశా వర్కర్లు సైతం ఆందోళనలకు పిలుపు నివ్వడంతో ఎపి ప్రభుత్వానికి ఒకే రోజు నిరసనల సెగ గట్టిగానే తగలనుంది. తమకు గౌరవ వేతనం కింద ఇస్తామన్న రూ.3000 వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 9న రాష్ట్రవ్యాప్త ధర్నాలకు రాష్ట్ర ఆశావర్కర్ల సంఘం పిలుపునిచ్చింది.ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని ఆ సంఘం నిర్ణయించింది. ఈ మూడు వేలతో పాటు ప్రతి ఆశా వర్కర్ నెలకు రూ.8500 వరకూ సంపాదించుకునే విధంగా ఇన్సెంటివ్స్ పెంచినట్లు అధికారులు ప్రకటించగా...జీవోలో మాత్రం ఇన్సెంటివ్స్కు రూ.3వేలు మించకూడదని సీలింగ్ పెట్టడం గమనార్హం. ప్రధానంగా ఈ రెండు అంశాలపై ఆశా వర్కర్లు ధర్నాకు పిలుపునిచ్చారు.
హిందీ పండిట్లు...నిరసన బాట
డీఎస్సీ 2018లో హిందీ ఉపాధ్యాయుల నియమానుసారంగా ఖాళీలు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఈ నెల 9న నిరసన కార్యక్రమం చేపట్టినట్లు హిందీ సేవా సదన్ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి ఎస్.గైబువలి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని హిందీ పండితులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. హిందీ ఉపాధ్యాయుల ఖాళీలు 3,500 వరకు భర్తీ చేయాల్సి ఉందన్నారు. 9న దుర్గా కళామందిర్ ఎదురుగా ఉన్న ప్రెస్క్లబ్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పెద్దఎత్తున నిరుద్యోగ హిందీ ఉపాధ్యాయులు హాజరుకావాలని ఆయన తన ప్రకటనలో కోరారు.