విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు -భారీగా నీరు లీకేజీ -కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అలర్ట్ -హెచ్చరికలివే
ఆంధ్రప్రదేశ్ లో అతి కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన పులిచింతల(కేఎల్ రావు మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు)లో అనూహ్య ఘటన జరిగింది. ప్రాజెక్టులో నీటిని నిలువ ఉంచేందుకు అతి ముఖ్యమైన క్రస్ట్ గేట్లలో ఒకటి ధ్వంసమైంది. దీంతో భారీ ఎత్తున నీరు లీకవుతూ ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తున్నది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ(ఏపీఎస్డీఎంఏ) కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అలర్ట్ జారీ చేసింది..
పులిచింతల ప్రాజెక్ట్ లోని 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్య కాస్తా పెద్దగా మారింది. భారీగా వరద వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్ విరిగిపోయింది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 16వ నంబర్ గేట్ పూర్తిగా విరిగిపోయింది. పులిచింతల ప్రాజెక్ట్ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. ఇప్పటికే ఇద్దరుప్రాజెక్టు ఇంజనీర్లు, నిపుణులు పరిశీలించారని, మరో రెండు ఇంజనీరింగ్ నిపుణుల బృందాల్ని పిలిపించామని తెలిపారు. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నామని మంత్రి అనిల్ తెలిపారు.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. '' ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన. వరద తాకిడికి 16వ నంబరు గేట్ కొట్టుకుపోయింది. నీటి సామర్థ్యం తగ్గిస్తేనే గేటు బిగించడం సాధ్యం. గేటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు'' అని తెలిపారు.ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.
సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది. సహాయక చర్యలకు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు.
Recommended Video
కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు.