పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం: ఎన్నికల్లో వైసీపీ ఎత్తుకు టీడీపీ చిత్తు: ట్విస్టుల మీద ట్విస్టులు..!
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురూ విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని అందరూ ఊహించిందే. అదే జరిగింది. అయితే, వైసీపీకి సంఖ్యా బలం ఉన్నా..టీడీపీ అనూహ్యంగా బలం లేకపోయినా వర్ల రామయ్యను బరిలోకి దించింది. టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి వైసీపీకి దగ్గర కావటంతో..ఈ ఎన్నిక లో పోటీ చేయటం ద్వారా విప్ జారీ చేసి ఆ ముగ్గురిని బుక్ చేయాలని టీడీపీ భావించింది. కానీ, వైసీపీ టీడీపీ ఎత్తుగడను తిప్పి కొట్టింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేయకుండా..అదే సమయంలో టీడీపీకి మద్దతు ఇవ్వకుండా... కొత్త వ్యూహం అమలు చేసారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఓటు సైతం చెల్లుబాటు కాలేదు. కొంతకాలంగా వైసీపీకి దగ్గరగా ఉంటున్న జనసేన ఎమ్మెల్యే సైతం వైసీపీకే ఓటు వేసారు.
Recommended Video
నలుగురు విజయం...
ఏపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ నుండి బరిలో నిలిచిన నలుగురు అభ్యర్ధులు సునాయాసంగా విజయం సాధించారు. వైసీపీ నుండి అభ్యర్ధులుగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్..మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామిక వేత్తలు పరిమళ్ నత్వానీ, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి పోటీలో నిలిచారు. కాగా, ఈ రోజు జరిగిన పోలింగ్ లో ఉదయం నుండి టీడీపీ తో విభేదించి వైసీపీకి దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేల పైనే అందరూ ఫోకస్ పెట్టారు. కాగా..ఎన్నికల్లో భాగంగా శాసనసభలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 151, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక్క సభ్యుడు ఉన్నారు. పోలింగ్ లో వైసీపీ నుండి మొత్తం 151 మంది హాజరయ్యారు. జనసేన అభ్యర్ధి సైతం వైసీపీకికే మద్దతు ఇచ్చారు. ఇక, టీడీపీ నుండి 23 మంది అభ్యర్దుల్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు తో పాటుగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హోం క్వారంటైన్ లో భాగంగా పోలింగ్ కు దూరమయ్యారు. మిగిలిన 21 మంది సభ్యుల్లో 17 ఓట్లు మాత్రమే టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు పడ్డాయి. మొత్తం173 ఓట్లు పోల్ కాగా, అందులో నాలుగు ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. వైసీపీ అభ్యర్దులకు 152 ఓట్లు దక్కాయి. ఒక్కో అభ్యర్ధికి 38 మంది మద్దుతుతో వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గెలుపొందారు.
నలుగురు టీడీపీ ఓట్లు చెల్లకుండా..
పోలింగ్ సమయంలో వైసీపీకి దగ్గర అయిన తమ ముగ్గురు సభ్యులు విప్ ద్వారా తమ చేతికి చిక్కుతారని, వారి పైన అనర్హత వేటు కోసం పోరాటం చేయవచ్చని టీడీపీ తమ అభ్యర్ధిని బరిలోకి దించింది. అయితే, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అయిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ముగ్గురూ టీడీపీ విప్ ధిక్కరించకుండా అదే సమయంలో టీడీపీకీ కానీ , వైసీపీకి కానీ ఓటు వేయకుండా తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా టీడీపీ చేతికి అనర్హత కోసం డిమాండ్ చేసే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించారు. ఇక..టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అవగాహన లేక పోవటంతో మొదటి ప్రాధాన్యత స్థానంలో 1 అని పెట్టాల్సిన చోట టిక్ చేసారు. దీంతో ఆ ఓటు చెల్లుబాటు కాకుండా పోయింది. దీంతో మొత్తం 23 మంది సభ్యులు ఉన్న టీడీపీ నుండి ఇద్దరు గైర్హాజరు..నాలుగు ఓట్లు చెల్లుబాటు కాకపోవటంతో కేవలం 17 ఓట్లు మాత్రమే టీడీపీ అభ్యర్ధికి దక్కాయి. అయితే ఒక టీడీపీ అభ్యర్ధి బ్యాలెట్ పేపర్ మీద రాసిన ఒక స్లోగన్ సైతం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీకే జనసేన ఓటు..
జనసేన తమ పార్టీ అభ్యర్ధికి విప్ జారీ చేయలేదు. దీంతో చాలా కాలంగా వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైసీపీకే ఓటు వేసినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తమ సొంత జిల్లాకు చెందిన బీసీ నేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రాపాక తన తొలి ప్రాధాన్యత ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో... నలుగురు వైసీపీ అభ్యర్ధులు తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ నుండి విజయసాయిరెడ్డి తో పాటుగా ప్రభాకర రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నిక ద్వారా నలుగురు గెలవటంతో పెద్దల సభలో వైసీపీ సంఖ్యా బలం ఆరుకు చేరింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా గెలిచిన బోస్, మోపిదేవి తమ మంత్రి పదవులను త్వరలో వీడనున్నారు. సాంకేతికంగా ఆరు నెలల పాటు వారు మంత్రులు గా కొనసాగే అవకావం ఉన్నా.. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణానికి ముందే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.