కరోనా సరుకుల్నీ వదిలిపెట్టని ఏపీ రేషన్ డీలర్లు- నిత్యావసరాల దోపిడీ యథాతథం..
రేషన్ డీలర్లకు సీజన్ తో సంబంధం లేదనే వాస్తవాన్ని మరోసారి వారు రుజువు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్ద ద్వారా పేద ప్రజలకు అందాల్సిన సరుకులను పూర్తిస్దాయిలోవారికి ఇవ్వాల్సింది పోయి వాటిని బయటికి అమ్ముకుంటున్న సందర్భాలు కోకొల్లలు. కానీ తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినా.. పలుచోట్ల రేషన్ డీలర్ల కక్కుర్తితో పేదలు మోసపోతున్నారు. డీలర్ల అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై సైతం దాడులు చేస్తున్న పరిస్దితులు కూడా ఎదురవుతున్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు.
కరోనా సరుకులూ వదిలిపెట్టం...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం పేదలకు నెలనెలా అందాల్సిన సరుకులను మాత్రం ఈసారి ఉచితంగా పంపిణీ చేస్తోంది. వాస్తవానికి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ సరుకులు పంపించాల్సి ఉండగా.. ప్రస్తుతం వారు కరోనా వైరస్ సర్వే విధుల్లో బిజీగా ఉన్నందున రేషన్ షాపుల ద్వారానే సరఫరా చేస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుని కొందరు రేషన్ డీలర్లు చెలరేగిపోతున్నారు. దీనిపై ప్రశ్నించినా ఫలితం ఉండటం లేదని పేదలు వాపోతున్నారు.
తూకాల్లో మోసాలతో దోపిడీ..
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులను ఉచితంగానే సరఫరా చేస్తోంది. దీన్ని అదనుగా తీసుకున్న కొందరు రేషన్ డీలర్లు అక్రమాలకు తెరలేపారు. ప్రతీ వస్తువూ బరువు చూసి ఇవ్వాల్సిన తరుణంలో తూకంలో మోసాలతో పేదలకు అందాల్సిన రేషన్ ను సైతం దోచుకుంటున్నారు. నిరక్షరాస్యులైన పేదలకు తూకాన్ని సరిచూసుకునే పరిజ్ఞానం లేకపోవడం, ప్రశ్నిస్తే అది కూడా ఇవ్వరన్న భయంతో వారు మిన్నకుండిపోతున్నారు. దీంతో రేషన్ దోపిడీ యథేచ్చగా సాగుతోంది.
వాలంటీర్లకు ఫిర్యాదు చేసినా..
నిత్యావసరాల పంపిణీ విషయలో రేషన్ డీలర్లు పాల్పడుతున్న మోసాలపై చాలా చోట్ల గ్రామ, వార్డు వాలంటీర్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ ప్రస్తుతం వాలంటీర్లు కూడా కరోనా సర్వే విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో వారికీ పట్టించుకునే సమయం ఉండటం లేదు. మరికొన్ని చోట్ల వాలంటీర్లు చొరవ తీసుకుని ప్రశ్నిస్తే తిరగబడటం, లేదా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని తప్పించుకోవడం జరుగుతోంది. దీంతో వాలంటీర్లు సైతం ఏమీ చేయాలని పరిస్ధితి.
Recommended Video
ప్రశ్నిస్తే అది కూడా ఇవ్వరన్న భయం..
రాష్ట్ర్రంలో పలుచోట్ల కరోనా వైరస్ కారణంగా నిత్యావసర సరుకులను ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా ఇస్తోంది. కానీ వీటిలో అక్రమాలను ప్రశ్నించేందుకు పేదలు ముందుకు రాని పరిస్ధితి. అడిగితే ఇచ్చే సరుకులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తారేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది. కరోనా దెబ్బకు వేలిముద్రలు లేకుండానే రేషన్ ఇస్తున్నారు. దీన్ని అడ్డంపెట్టుకుని రేషన్ డీలర్లు మరిన్ని అక్రమాలకు తెరతీస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్ధితి మరింత దిగజారే ప్రమాదముంది.