ఎపిలో...ఇక సర్టిఫికెట్ల చెకింగ్ అంతా ఆన్ లైన్లోనే...
అమరావతి: హైటెక్ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన చంద్రబాబునాయుడు పరిపాలనలో టెక్నాలజీ మేళవింపును మరింత ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ఎపి సిఎం తీసుకున్నఒక నిర్ణయం విద్యా, ఉపాధి రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది.
ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ ఏపీగా తీర్చిదిద్దేందుకు హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్టీజిఎస్ తో పరిపాలనలో టెక్నాలజీ మేళవించిన ముఖ్యమంత్రి తాజాగా విద్యా,ఉద్యోగ రంగాలకు సంబంధించి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎడ్యుకేషన్, జాబ్ లకు సంబంధించి అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను ఇక ముందు ఆన్లైన్లోనే పరిశీలించాలనేదే ఆ నిర్ణయం...ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది.
2018 నుంచే...
ఈ విధానం వల్ల ఉమ్మడి ఎంట్రన్స్లులు, వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు గొప్ప ఊరట లభించనుంది. దీనివల్ల దూరప్రాంతాల్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్లి తమ ఒరిజినల్స్ను వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలన్నింటినీ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. 2018లో నిర్వహించే సెట్స్కు ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.
ఇలా చెయ్యాలి...
ఈ విధానంలో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తును నింపేటప్పుడే అవసరమైన అన్ని వివరాలను పూర్తిచేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించిన తర్వాత కౌన్సెలింగ్ సమయంలో సీటు కోసం టెన్త్, ఇంటర్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను హెచ్ఎల్సీల వద్ద వెరిఫికేషన్ చేయించుకునేవారు.
Recommended Video
అధికారులే వెరిఫై...
ఇలా అభ్యర్థులు అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి ధృవీకరణను ఆయా బోర్డుల నుంచి అధికారులే తీసుకుంటారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి పొందుతారు. అలాగే అభ్యర్థులు తమ దరఖాస్తులో నమోదు చేసే కుల ధ్రువీకరణ పత్రం నంబరు ఆధారంగా సంక్షేమశాఖ నుంచి సమాచారం తెప్పించుకుని వెరిఫై చేస్తారు.
మరోసారి సమావేశం...
ఇలా ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ను మొదటిసారిగా ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జనవరి 4న ఏపీ-ఆన్లైన్, జ్ఞానభూమి వెబ్సైట్లను నిర్వహిస్తున్న అధికారులతో సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర విద్యార్థుల విషయంలో ఏ ఇబ్బంది లేకపోయినా, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో వెరిఫికేషన్ చేయడంలో ఎదురయ్యే సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ విధానంపై విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.