ట్విస్ట్ : టీడీపీ రెబల్స్ కొత్త ఎత్తుగడ.. రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో తెలుసా..?
ఏపీ రాజ్య సభ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీ వైపు నిలుస్తారనేది ముందునుంచి ఆసక్తికి కారణమైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసే సరికి టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.ఈఎస్ఐ స్కామ్లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు హోం క్వారంటైన్ లో ఉన్న కారణంగా అనగాని సత్యప్రసాద్ పోలింగ్కు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పటికే టీడీపీ నుంచి దూరమై వైసీపీకి దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటు వేస్తారనేది ఉత్కంఠకు కారణమైంది. రాజ్యసభ ఎన్నికల్లో వీరిని లక్ష్యంగా చేసుకుని ఒక రకంగా బలంలేకపోయినా పసుపు పార్టీ బరిలోకి దిగింది. సభ్యులందరికీ విప్ జారీచేసింది.
పోలింగ్ ముగుస్తుందనగా ఓటు వేసిన రెబల్స్
పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే కృష్ణా జిల్లా మంత్రులతో కలిపి వల్లభనేని వంశీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కానీ ఓటు మాత్రం వేయలేదు. మద్దాలి గిరి సైతం వైసీపీ నేతలతోనే కలియతిరిగారు. మధ్యాహ్నం తర్వాత ప్రకాశం జిల్లా మంత్రి బాలినేనితో కలిపి కరణం బలరాం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. వీరు ముగ్గురు ఎవరికి ఓటేస్తారని ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలోనే మరో 20 నిమిషాల్లో పోలింగ్ ముగుస్తుందనగా ఆ ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురులో వల్లభనేని వంశీని పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. సభలో స్పీకర్ సైతం ఆయన్ను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు.
టీడీపీకి చిక్కకుండా జాగ్రత్తపడ్డ రెబల్స్
ఇక పార్టీ విప్ ఇవ్వడంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్తో పాల్గొనడంతో పాటుగా ఎవరికి ఓటువేశారో ఏజెంట్లకు చూపించడం తప్పనిసరిగా నిబంధనలు చెబుతున్నాయి. విప్ జారీ చేయడంతో అనర్హత వేటు అంశం వారి ముగ్గురుని వెంటాడే అవకాశం ఉంది. దీంతో తాము ధిక్కరించిన టీడీపీకి ఓటు వేయకుండా అలాగని వైసీపీకి ఓటు వేసి టీడీపీకి చేతికి చిక్కకుండా ముగ్గురూ జాగ్రత్త పడ్డారు. వైసీపీ వ్యూహం మేరకు ఈ ముగ్గురు ఓటింగ్లో పాల్గొని టీడీపీకే ఓటు వేసిన అది చెల్లుబాటు అవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్కు మార్కు పెట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఓట్లకు విలువ లేకుండా చేశారు. ఇది ఉల్లంఘన కింద కూడా రాదని నిపుణులు చెబుతున్నారు.
గెలిచే పాటైతే ఓటు చంద్రబాబు కోటరీకి...
తాము టీడీపీతో విబేధిస్తున్నా ఎక్కడా సాంకేతికంగా దొరకకుండా జాగ్రత్త పడ్డారు. వైసీపీతో దాదాపు కలిసిపోయినా అధికారికంగా సాక్షాలు లేకుండా ఇప్పటి వరకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ వ్యూహకర్తలు రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీకి షాకిచ్చారు. ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురూ తమను కాదని వైసీపీకి ఓటువేస్తారని తాము ఇచ్చిన విప్ ద్వారా ఈ ముగ్గురుపైనా చర్యలు తీసుకోవచ్చని టీడీపీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే మరో ఎమ్మెల్యే ఓటు కూడా చెల్లనిదిగా అధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తున్న కోస్తాప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యేదిగా అంచనా వేస్తున్నారు. "గెలిచే పాటైతే ఓటు చంద్రబాబు కోటరీకి ఓటమిపాలైతే దళితుడికా" అంటూ బ్యాలెట్ పేపర్పై ఆ ఎమ్మెల్యే రాసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా 1అని పెట్టాల్సిన చోట టిక్ మార్క్ పెట్టారు.దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం.అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని చంద్రబాబు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారి అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ నేతల కనుసన్నల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల నాట్ వ్యాలిడ్ ఎత్తుగడ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.