ఏపీలో 7 వేలకు తగ్గిన కొత్త కేసులు- గోదావరి, ప్రకాశం జిల్లాలో వైరస్ కల్లోలం...
ఏపీలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తోంది. రెండు వారాల క్రితం వరకూ పది వేలకు పైగా కేసులు నమోదైన పరిస్దితి నుంచి ప్రస్తుతం రోజువారీ కేసులు దాదాపు ఏడువేలకు దగ్గరగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కూడా కాస్త ఊరట లభిస్తోంది. గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే భారీగా కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో గత 24 గంటల్లో 7073 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 1031 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్ధానాల్లో పశ్చిమగోదావరి 931, ప్రకాశం 806, చిత్తూరు 713 టాప్లో ఉన్నాయి. అలాగే అత్యల్ప కేసులు నమోదవుతున్న జిల్లాలో కర్నూలు 205 కేసులతో అగ్రస్ధానంలో ఉండగా.. ఆ తర్వాత స్ధానాల్లో విశాఖ 340, కడప 368, విజయనగరం 378, కృష్ణా 423, అనంతపురం 456 కేసులతో ఉన్నాయి. ఇప్పటివరకూ ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6.61 లక్షలకు చేరుకోగా..వీటిలో 5.88 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 67 వేల యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఎనిమిదేసి కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లోఅనంతపురంలో ఆరుగురు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప, నెల్లూరు,విశాఖలో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరులో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళంలో ఒక్కరు చనిపోయారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5606కు చేరుకుంది.