ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్యల్ప కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కేవలం 1916 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం 14 మరణాలు చోటు చేసుకున్నాయి.
Recommended Video
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్ ... ఏపీలో తాజా కరోనా పరిస్థితి ఇదే
ఏపీలో గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల్లో పశ్చిమగోదావరి 426 కేసులతో అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానాల్లో తూర్పుగోదావరి 354, గుంటూరు 179, ప్రకాశం 178, కడప 141, చిత్తూరు 121, అనంతపురం 106, విశాఖ 105 ఉన్నాయి.
అత్యల్ప కేసులు నమోదైన జాబితాలో కర్నూలు కేవలం 22 కేసులతో టాప్లో ఉంది. ఆ తర్వాత స్దానాల్లో విజయనగరం 55, కృష్ణా 68, శ్రీకాకుళం 68, నెల్లూరు 93 ఉన్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8.27 లక్షలకు చేరింది. ఇందులో 7.98 లక్షల మంది కోలుకున్నారు. మరో 22500 మంది చికిత్స పొందుతున్నారు.
మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో అనంతపూర్, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6719కి చేరింది. నవంబర్లో కరోనా సెకండ్ వేవ్ తప్పదని ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం విశేషం.