ఏపీలో సింగిల్ డే రికార్డు- ఒక్క రోజులో 1322 కేసులు- ఏడుగురు మృతి-భయానకంగా పరిస్ధితి...
ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఒక్క రోజులేనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. పాత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 24 గంటల్లో 1322 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడుతోంది. సాధారణ జనం అయితే ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకుండా పోతోంది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 16 వేల 712 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 1322 పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో విదేశాలకు చెందిన వారు ముగ్గురు కాగా.. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 56 మంది ఉన్నారు. మిగిలిన 1263 మంది ఏపీకి చెందిన వారే. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 20 వేల 19కి చేరింది. వీరిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8920గా ఉంది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10 వేల 860 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా కారణంగా గత 24 గంటల్లో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 239కి చేరుకుంది. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిలాల్లో రెండేసి వేలకు పైగా కేసులు నమోదుకావడంతో ఇక్కడ వైరస్ ఉధృతి దారుణంగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మిగతా జిల్లాల్లోనూ కనీసం వెయ్యి కేసులకు పైగా నమోదయ్యాయి.