ఏపి పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: తెలుగు ఎంపీల స్పందన
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఏపి పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు శుక్రవారం ఆమోదం లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మండలి సభ్యుల సంఖ్య 50 నుంచి 58కి పెరగనుంది. అంతకుముందు రాజ్యసభలో పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు బిల్లుపై మాట్లాడారు.
ఏపి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పులు చేయలేదని మాజీ కేంద్రమంత్రి, ఎంపి జేడీ శీలం అన్నారు. ఏపి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మిగితా అన్ని పార్టీలు ముందుకు రావడంతోనే రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిందని చెప్పారు.
తెలుగుదేశం, బిజెపిలు విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడం సరికాదని అన్నారు. విభజన బిల్లులో చిన్న చిన్న మార్పులే అవసరమని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన విభజన బిల్లులో ఎలాంటి లోపాలు లేవని చెప్పారు.
తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇవ్వాలి: వీహెచ్
ఎన్డీఏ ప్రభుత్వం ఏపిలోని పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, అలాగే తెలంగాణలోని ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో 4వేల వాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణలో ఎక్కువగా వ్యవసాయదారులు బోర్ వెల్స్పైనే ఆధారపడుతున్నారని చెప్పారు.
ఏపి కృష్ణపట్నం నుంచి తెలంగాణకు ఎలాంటి విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్ లాంటి వెనకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
బిల్లులో లోపాలున్నాయి: సిఎం రమేష్
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లులో అనేక లోపాలున్నాయని ఎంపి సిఎం రమేష్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును సరిదిద్దుతోందని చెప్పారు. రేపు ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చట్టంలో చెప్పినట్లుగా హామీలన్నీ నెరుస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. 7వేల కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి కృతజ్ఞతలు అని తెలిపారు.
కాంగ్రెస్ విభజన చేసి ఏపిని నాశనం చేసిందని సిఎం రమేష్ ఆరోపించారు. ఏపిలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటులో ఏపి కోసం మాట్లాడుతున్నారని అన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్నాం: కెవిపి
2014, ఫిబ్రవరి 20న విభజన చేయకూడదని పార్లమెంటులో కన్నీళ్లు పెట్టుకున్నామని, అందరి పాదాలు పట్టుకుని విభజన తప్పని చెప్పామని ఎంపి కెవిపి రామచంద్రరావు చెప్పారు. విభజనతో ప్రజల మధ్య అగాథం పెరుగుతుందని చెప్పినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. బిజెపి కూడా విభజనకు సహకరించిందని తెలిపారు. ఏపికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని, వెనకబవిన జిల్లాలకు ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే అమలు చేయాలని అన్నారు.
మరో ఎంపి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలని అన్నారు. విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఆయన, హైదరాబాద్ లేకుండా ఏపి తీవ్ర రెవెన్యూ లోటులో ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని అన్నారు.
ఎంపి ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపిల మధ్య నీటి వివాదాలు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో ఎంపి రేణుక మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాలు చూడకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాలపై ఉదారత చూపించడం కాదు, ప్రయోజనం పొందడం తమ హక్కని అన్నారు.
మరో ఎంపి మహ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు, మన్మోహన్ సింగ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఏపిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిధులు మంజూరు చేయాలని అన్నారు.