యూనివర్సిటీల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే తాట తీస్తాం: నన్నపనేని
గుంటూరు: విశ్వవిద్యాలయాలలో ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే తాట తీస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
నెల రోజుల క్రితం జేఎన్టీయూకేలో ఓ ప్రొఫెసర్ విద్యార్థులను వేధించడంపై నన్నపనేని తీవ్రంగా స్పందించారు. యూనివర్సిటీ సెనేట్ హాలులో విద్యార్థునిలతో మాట్లాడారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ పైన కేసు పెట్టడం అభినందనీయమని చెప్పారు.
ఆయనపై నిర్భయ కేసు పెట్టినా బెయిల్ దొరకడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సంఘటన జరిగిన రోజు సదరు ప్రొఫెసర్ నిర్వహించిన వైవాకు సంబంధించి ఫలితాలను రిజర్వులో ఉంచారని, విద్యార్థుల కోరిక మేరకు మరో ప్రొఫెసర్తో మూల్యాంకనం చేయిస్తామన్నారు.
సదరు ప్రొఫెసర్ విశ్వవిద్యాలయానికి రాకుండా చేయాలన్నారు. అతనే స్వచ్ఛందంగా వేరే చోటుకు వెళ్లిపోతే మంచిదని హితవు పలికారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడితే మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు.