రాష్ట్రంలో నెత్తురోడుతున్న రోడ్లు...6 నెలల్లో 4 వేల మంది బలి
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రయాణాల్లోనే వేలాదిమంది బతుకులు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
రాష్ట్రంలో గడచిన 6 నెలల్లో4000 మందికి పైగా మృత్యువాతన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా మరో 14 వేల మంది క్షతగాత్రులైనట్లుగా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదాల నివారణకు శుక్రవారం రహదారి భద్రత అథారిటీతో సమీక్ష జరపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 2017 జనవరి నుంచి మార్చి వరకు జరిగిన ప్రమాదాల్లో 2164 మంది చనిపోగా, 2018 మార్చి వరకు మరో 1897 మంది మృత్యువాతన పడ్డారు. 2017 మార్చి వరకు 5856 ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిలో 2164 మంది మరణించారు, 7362 మంది గాయాలపాలయ్యారు. అదే 2018 మార్చి వరకు 5259 ప్రమాదాలు సంభవించగా, వీటిలో 1897 మంది మృత్యువాత పడ్డారు, మరో 6192 మంది క్షతగాత్రులుగా మారారు. ఫలితంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఇక కొన్ని కారు ప్రమాదాల్లోనైతే ఏకంగా కుటుంబాలకు కుటుంబాలే మరణించిన ఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి.
అయితే గత సంవత్సరం తొలి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రమాదాల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా అది అధికారులు చేపట్టిన భద్రతా చర్యల వల్లే అని చెప్పలేని పరిస్థితి. ఇక ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, తెల్లవారుజామున నిద్రమత్తు ప్రయాణాలుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రమాదాల నివారణకు గతంలో వివిధ చర్యలు తీసుకున్నప్పటికీ, ఎప్పటికప్పుడు కొత్త కొత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు.
ఇక ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విస్తరించివున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుంటూరు జిల్లాలో మొత్తం ఆరు నెలల్లో 1180 ప్రమాదాలు జరగ్గా, వాటిల్లో 469 మంది మృతిచెందారు. మరో 1264 మంది గాయాలపాలయ్యారు. కృష్ణా జిల్లాలో కూడా 1417 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, అరదులో 394 మంది మృత్యువాతపడగా, 1721 మంది గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా శుక్రవారం జరిగే రహదారి భద్రత అథారిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వాహనాలు నడపడం, సిగ్నల్స్ పాటించకపోవడం, ఇతర నిబంధనలను పాటించనివారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యే అవకాశం ఉంది.