మర్కజ్ మత ప్రార్థనల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి: ఢిల్లీకి వెళ్లిన మాట నిజమే.. కానీ: అంజద్ భాషా క్లారిటీ
కడప: యావత్ దేశాన్ని ఆందోళనలోకి నెట్టేసిన ఉదంతం ఢిల్లీ మత ప్రార్థనలు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొనడం, వారిలో చాలామందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అన్ని రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. ఈ మత ప్రార్థనల్లో పాల్గొని, స్వస్థలానికి చేరుకున్న వారి గురించి ఆరా తీస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్టుగా ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నాయి.
ఇవే మత ప్రార్థనల్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా కూడా పాల్గొన్నారనే వార్తలు కడప జిల్లాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మత ప్రార్థనలు జరిగే సమయంలో ఆయన ఢిల్లీలోనే ఉన్నారని అంటున్నారు. మత ప్రార్థనల్లో పాల్గొనడానికి వ్యక్తిగతంగా ఢిల్లీకి వెళ్లారని, మర్కజ్ మసీదులో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారనే వార్తలు కలకలం రేపాయి. ఆయనకు కూడా క్వారంటైన్కు తరలించాలనే డిమాండ్ వినిపించింది.
ఈ వార్తలను అంజద్ భాషా తోసిపుచ్చారు. క్లారిటీ ఇచ్చారు. కిందటి నెల 2వ తేదీన తాను ఢిల్లీకి వెళ్లానని, ఆ మరుసటి రోజే రాష్ట్రానికి తిరిగి వచ్చానని తెలిపారు. మత ప్రార్థనలు జరిగే సమయంలో తాను ఢిల్లీలో లేనని అన్నారు. ఓ వ్యక్తిగత కేసుకు సంబంధించిన విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలవడానికి తాను కిందటి ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. 3వ తేదీన న్యాయవాదిని కలిశానని, అదేరోజు కడపకు చేరుకున్నానని వివరణ ఇచ్చారు.
ప్రపంచానికి కరోనా వైరస్ను అంటించి: తన పని తాను చేసుకుంటోన్న వుహాన్: షియోమి డోర్లు ఓపెన్
5వ తేదీన ముఖ్యమంత్రి నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరయ్యానని అన్నారు. ఢిల్లీలో ఉన్న సమయంలో నమాజ్ చేయడానికి స్థానిక మసీదును సందర్శించానే తప్ప మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొనలేదని అంజద్ భాషా స్పష్టం చేశారు. 5వ తేదీ నుంచి తాను కడపలోనే ఉన్నానని, లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నానని చెప్పారు.