కృత్రిమ కొరత సృష్టించేందుకే.. ఏపీ ఇసుక బుకింగ్ పోర్టల్ హ్యాక్: ‘బ్లూ ఫ్రాగ్’లో సీఐడీ సోదాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతతో పలువురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రతిపక్ష పార్టీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలే ఇసుక కొరతను కృత్రిమంగా సృష్టించి బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కాగా, గత ప్రభుత్వంలో ఇసుక విధానంలో లోపాలున్నాయని, అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్ సర్కారు కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఆన్లైన్లోనే ఇసుక కొనుగోలు చేసేలా.. శాండ్ పోర్టల్ను కూడా ప్రారంభించింది. ఇక అక్రమాలకు తావుండదని ఏపీ సర్కారు భావించింది.
అయితే, ఏపీ సర్కారు ప్రారంభించిన ఇసుక పోర్టల్ హ్యాకింగ్కు గురైంది. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ.. శాండ్ వెబ్ సైట్ను హ్యాక్ చేసినట్లు సీఐడీ గుర్తించింది. దీంతో బ్లూ ఫ్రాగ్ కంపెనీలో సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లను, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకే శాండ్ వెబ్ సైట్ను బ్లూ ఫ్రాగ్ హ్యాక్ చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. బ్లూ ఫ్రాగ్ సంస్థలోని కొంతమంది ఉద్యోగులు శాండ్ వెబ్ సర్వర్లను హ్యాక్ చేసి, ఇసుక సరఫరాను బ్లాక్ చేశారని ఫిర్యాదు రావడంతో సీఐడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించనిట్లు తెలిసింది.
కాగా, శాండ్ వెబ్ సైట్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడంతోపాటు పోర్టల్ నిర్వహణ కూడా బ్లూ ఫ్రాగ్ సంస్థే పర్యవేక్షిస్తోందని సమాచారం. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించేందుకు చేసిన ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేదానిపై సీఐడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ సంస్థ టీడీపీ నేత నారా లోకేష్ బంధువులదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు.