ఇక ఇంటికే రేషన్ సరుకులు..! వినూత్న అడుగులు వేయనున్న జగన్ సర్కార్..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతే కాకుండా వైసీపి ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందిపరిచిన అంశాల అమలు దిశగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పౌర సరఫరాల విభాగంలో పేద ప్రజలకు అందాల్సిన నిత్యావపర సరుకుల్లో ఎలాంటి గోల్ మాల్ జరగకుండా జాగ్రత్త పడుతోంది ఏపి ప్రభుత్వం. అంతే కాకుండా నిత్యావసర సరుకుల పంపకాల్లో అదికారుల చేతివాటం పైన కూడా కన్నేసింది. ఇటీవల దాదాపు లక్షా నలభైవేల నకిలీ తెల్ల రేషన్ కార్డులను తొలగించిన ఏపి ప్రభుత్వం, సంక్షేమ పథకాలను నేరుగా అర్హులకు అందేలా చర్యలు చేపడుతోంది.
సెప్టెంబర్ నుంచి నేరుగా ఇంటికే సరఫరా..! ఏపీలో కార్డుదారులకు అందజేత..!!
అందుకోసం ప్రభుత్వం తరుపునుంచే కొంత మందిని నియమించి వారి ద్వారానే నిత్యావసర వస్తువులను నేరుగా వారి ఇళ్లకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఏపి ప్రభుత్వం. రేషర్ కార్డుల వ్యవస్ధను మొత్తం ఆన్ లైన్ చేసి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బంధీగా ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. రేషన్ కార్డుల ఆన్ లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారం నుండి ఇంటింటికి రేషన్ సరుకులు పంపించే బృహత్ కార్యక్రమానికి ఏపి ప్రభుత్వం శ్రీకారం చుట్ట బోతోంది.
ఎక్కడ నుంచైనా రేషన్ సరుకుల పంపిణీ..! వలసదారులకు కూడా అందనున్న సరుకులు..!
రాష్ట్రంలో రేషన్ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా రాష్ట్రాల్లోనే సబ్సిడీ సరుకులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తోంది.
ప్రతినెలా 30 లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి..! పక్కాగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు..!!
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో తెల్లరేషన్ కార్డులు కల్గి ఉండి తెలంగాణలో ఉంటున్న వారు ఈ-పాస్ ద్వారా సరుకులు తీసుకునే విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రేషన్ తీసుకునే విధానం విజయవంతమైతే ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేయనున్నారు. కాగా, ఏపీలోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే రాష్ట్రానికి చెందిన మరికొందరికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్..! పౌర సరఫరాల శాఖ వినూత్న ప్రయోగం..!!
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ నుంచి ప్రజా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. 5, 10, 20 కిలోల బ్యాగుల ద్వారా బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్లకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వచ్చినా వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా రేషన్ డీలర్ (స్టాకు పాయింట్లు) వద్దే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఈ-పాస్ మిషన్లలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఎక్కడ, ఏ రేషన్ దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్లైన్లో నమోదవుతుంది. కాగా, ఏదేని రేషన్ షాపులో 50 శాతం సరుకు పూర్తికాగానే సంబంధిత జిల్లా డీఎస్ఓలను అప్రమత్తం చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్ వెళ్తుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు.