కృష్ణా జలాలపై ఎపి కొలికి: తెలంగాణకు చుక్కనీరివ్వొద్దని లేఖ
కృష్ణా జలాలపై ఎపి ప్రభుత్వం మరో కొలికి పెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ జలాలన్నీ తమవేనని, తెలంగాణకు ఏ మాత్రం నీరు ఇవ్వకూడదని ఎపి వాదిస్తోంది.
హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలికి పెట్టింది. ఇక తెలంగాణకు కృష్ణా జలాల నుంచి చుక్క నీరు కూడా ఇవ్వకూడదని వాదిస్తోంది. ఈ మేరకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు శుక్రవారం లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాను పూర్తిగా వాడేసుకుందని, ఇకపై ఆ రాష్ట్రానికి నీటిని విడుదల చేయకూడదని ఆంధ్రప్రదేశ్ తేల్చి చెప్పింది.
నీటి కేటాయింపుల విషయంలో వాడకం లెక్కలను సరిగా లెక్క వేయకుండా తెలంగాణ కోరినట్లుగా విడుదల చేయడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆంధ్ర ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. 2016-17 నీటి సంవత్సరానికి ఇక తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల వాడకంలో తెలంగాణ పూర్తి లెక్కలను ఇవ్వడం లేదని, చిన్న, మధ్య తరహా నీటి వాడకం లెక్కలను పరిశీలిస్తే తెలంగాణకు ఇంకా 4.2 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, ఇది కూడా బోర్డు పేర్కొంటున్నట్లుగా తృతీయ ప్రత్యామ్నాయం కింద లెక్కలు వేస్తేనే తెలంగాణకు దక్కుతుందని ఆయన అన్నారు.
కృష్ణా - తుంగభద్ర జలాలను కూడా లెక్కిస్తే తెలంగాణ ఇప్పటికే అధికంగా 4.12 టీఎంసీలను వాడుకుందని, అందువల్ల శ్రీశైలం జలాశయంలో ఇప్పుడు నిల్వ ఉన్న నీరంతా తమకే దక్కుతుందని అన్నారు గత నెల 18న బోర్డు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి 1.3 టీఎంసీలు, కుడి కాలువ నుంచి 5 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 1.25 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని, కానీ ఇంతవరకు తెలంగాణ ఈ నీటిని కిందకు వదలడం లేదని వివరించారు. ఈ నీటిని విడుదల చేసిన తర్వాతనే తదుపరి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
అదే సమయంలో బోర్డు తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తంచ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల విషయంలో పెద్ద మనిషి తరహాలో వ్యవహరించాల్సిన బోర్డు పనితీరు ఏమీ బాగోలేదని ఆంధ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని. తెలంగాణ పట్ల పక్షపాతిగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర జల వనరుల శాఖకు శుక్రవారం ఫిర్యాదు చేసిందని అన్నారు. నీటి వాడకం లెక్కల విషయంలో తెలంగాణ వాస్తవాలు చెప్పడం లేదని, అయినా బోర్డు పట్టించుకోవడం లేదని, పైగా ఏపీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తోందని అన్నారు.
కృష్ణా, తుంగభద్ర జలాలను కలిపి కృష్ణా జలాల నీటి కేటాయింపులు చేయాల్సి ఉండగా ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా మూడో ప్రత్యామ్నాయమంటూ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకురావడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది.