ఏపీ ఎస్ఈబీ ఏర్పాటుపై రాజకీయ ప్రేరేపిత పిటీషన్ .. రివర్స్ లో పిటీషన్ వేసిన ఉద్యోగుల సమాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి నేటి వరకు ప్రభుత్వం తీసుకుంటున్న దాదాపు అన్ని నిర్ణయాలపైన వరుసగా కోర్టుల్లో కేసులు వేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నాసరే దాని మీద ఎవరో ఒకరు,అసలు ఆ అంశానికి సంబంధమే లేని వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. ఇక తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుపైన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఏపీలో రంగుల రాజకీయం .. వైసీపీ వర్సెస్ టీడీపీ .. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారుగా !!
ఏపీ సర్కార్ ఎస్ఈబీ ఏర్పాటు నిర్ణయంపై హైకోర్టులో పిటీషన్
ఇందులో ప్రధానంగా గమనించాల్సిన అంశానికి వస్తే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు కానీ,అధికారులు కానీ తాము నష్టపోతున్నామని కోర్టును ఆశ్రయించ లేదు. కరెక్ట్ గా చెప్పాలి అంటే వివిధ విభాగాలను ఏర్పాటు చేయడం లేదా విలీనం చేయడం అనేది పూర్తిగా పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది కొరత,అదనపు భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.అది ప్రభుత్వానికి ఉన్న అధికారం. ఇక ఈ ప్రభుత నిర్ణయాధికారం కూడా ప్రతి నిత్యం కోర్టు ముందు పరీక్షను ఎదుర్కొంటుంది. ఏపీ సర్కార్ ఎస్ఈబీ ఏర్పాటు నిర్ణయంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
ఉద్యోగులతో ,సంబంధిత శాఖతో సంబంధం లేని పిటీషనర్ .. ఏపీలో చర్చ
ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ఎవరైతే నష్టపోతారో వారు కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ తాజాగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో వ్యవహారంలో కోర్టును ఆశ్రయించింది అసలు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. చట్ట నిబంధనలను సవరించకుండా ఎస్ఈబీ ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ పోలూరి పిటిషన్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులలో లేని వ్యతిరేకత, శాఖాపరంగా లేని ఇబ్బంది పోలూరికి ఏమొచ్చిందని చర్చ జరుగుతోంది.
పోలూరి పిటీషన్ వ్యతిరేకిస్తూ ఉద్యోగ సమాఖ్య మరో పిటీషన్
అయితే పోలూరి శ్రీనివాసరావు వేసిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సమాఖ్య మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా తన పిటిషన్లో పేర్కొంది. పిటిషనర్ కు ప్రభుత్వ నిర్ణయంతో ఎలాంటి సంబంధమూ లేదని, ఇటువంటి వాటికి అనుమతిస్తే ప్రభుత్వ వ్యతిరేకతతో రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వేదికగా మార్చుకుంటారని తమ పిటిషన్లో పేర్కొంది ఉద్యోగ సమాఖ్య.
పరిపాలనలో జగన్ దూకుడు తట్టుకోలేకే కోర్టుల్లో కేసులు అని వైసీపీ నేతల విమర్శలు
పరిపాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో అడుగడుగునా చుక్కెదురు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ నేతలు రాజకీయ ప్రేరేపిత కేసులే ఎక్కువగా కోర్టుల్లో నమోదవుతున్నాయి అని ఇదంతా టీడీపీ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 75 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు అని టిడిపి నేతలు అంటున్నారు. అయితే ఈ కేసులన్నీ టిడిపి ప్రేరేపిత కేసులేనని ప్రధానంగా విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. పరిపాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు తట్టుకోలేక చంద్రబాబు ఈ తరహా కేసులకు ప్రేరేపిస్తున్నారు అని వారంటున్నారు.