ఏపీలో స్ధానిక పోరు వాయిదా పడకపోతే... విపత్తు నుంచి కాపాడారంటూ నిమ్మగడ్డపై ప్రశంసలు..
దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఏపీలో మాత్రం అత్యంత తక్కువగా కనిపిస్తోంది. మొన్నటి వరకూ కేవలం 3 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా నిన్న ఒక్కరోజే రెండు కేసులు తేలాయి. దీంతో మొత్తం సంఖ్య ఐదుకే పరిమితమైంది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగా ఉండటానికి ఆ ఒక్క నిర్ణయమే కారణమైందా అంటే అవుననే సమధానమే సాధారణ ప్రజల నుంచి సైతం వినిపిస్తోంది.
కరోనా ప్రభావం ముందుగానే..
ఏపీలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి దేశవ్యాప్తంగా అక్కడక్కడా కరోనా వైరస్ ప్రభావం కనిపించినా ఏపీలో మాత్రం ఆ జాడలు లేవు. కానీ ఎన్నికలు వాయిదా పడే నాటికి మాత్రం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నెల్లూరులో నమోదైంది. అయితే అప్పట్లో ఒక్క కేసుకే ఎన్నికలు వాయిదా వేసేస్తారా అంటూ సీఎం జగన్ తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతీ అభ్యర్ధీ మండిపడ్డాడు. కొన్ని విపక్ష పార్టీలు మినహా మిగతా వారెవరికీ ఈ నిర్ణయం రుచించలేదు.
వారం రోజులు గడిచేసరికి..
ఏపీలో స్ధానిక ఎన్నికలు వాయిదా పడటం, ఆ నిర్ణయంపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి విఫలం కావడం, ఆ తర్వాత స్ధానిక ఎన్నికల వాయిదాలో నిమ్మగడ్డ కుట్ర ఉందంటూ ఆరోపణల పర్వం సాగడం ప్రజలను ఆలోచనలో పడేశాయి. అయితే ఇవన్నీ కేవలం ఆరోపణలే అని నిరూపణ అయ్యేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. వారం రోజుల్లోనే కరోనా వైరస్ రెండో కేసు, ఆ తర్వాత మరో కేసు.. చివరికి నిన్నటికి ఐదో కేసుకు చేరింది. దీంతో ఇప్పుడు స్ధానిక ఎన్నికలు వాయిదా వేయడం మంచిదైందా అనే వాదన మొదలైంది.
నిమ్మగడ్డ నిర్ణయాన్ని విమర్శించి..
స్ధానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని విమర్శించి రాష్ట్రంలో అసలు కరోనా ప్రభావమే లేదని చెప్పుకున్న వైసీపీ సర్కారు... కేవలం గత నాలుగైదు రోజుల్లోనే రాష్ట్రాన్ని దాదాపుగా లాక్ డౌన్ చేసే పరిస్ధితికి వచ్చింది. తొలుత విద్యాసంస్ధలు, తర్వాత మాల్స్, గుళ్లు, ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసేసే పరిస్ధితి రాష్ట్రంలో నెలకొంది. అంటే నిమ్మగడ్డ నిర్ణయం సరైనదేనని సర్కారు ఒప్పుకున్నట్లయింది. అయితే దీన్ని అంగీకరించేందుకు మాత్రం వైసీపీ నేతలు సిద్ధం కావడం లేదని నిన్నటి వైసీపీ ఎంపీ సాయిరెడ్డి విమర్శలను చూస్తే అర్ధమవుతోంది.
Recommended Video
ఎన్నికలు వాయిదా పడకపోతే..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను గమనిస్తే స్ధానిక ఎన్నికలు వాయిదా పడకపోతే ఈ వైరస్ తీవ్రత ఏ స్ధాయిలో ఉండేదో ఊహించడానికి కూడా వీల్లేని పరిస్దితి. స్ధానిక ఎన్నికలు వాయిదా పడకపోతే విదేశాల నుంచి ఓటు వేసేందుకు వేల సంఖ్యలో జనం ఇప్పటికే ఏపీకి చేరుకుని ఉండేవారు. వీరి నుంచి వందల సంఖ్యలో స్ధానికులకు వైరస్ సోకి ఉండేది. అప్పుడు దేశంలోనే కరోనా ప్రభావం ఏపీలోనే ఎక్కువగా ఉండే పరిస్ధితి ఉండేది. కానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ముందుచూపుతో ఆలోచించి కరోనాపై కీలక నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు అందరూ అంగీకరించాల్సిన పరిస్ధితి.