జగన్ సర్కారుకు భారీ షాక్.. నిమ్మగడ్డ కేసులో సుప్రీం తీవ్ర స్పందన.. ‘ధిక్కరణ’పై స్టే కు నిరాకరణ..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయంలో కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమారే కొనసాగాలంటూ న్యాయస్థానాలు, గవర్నర్ చెప్పినా.. ఆమేరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం తెలిసిందే. ఈ విషయంలో జగన్ సర్కారుపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా ధర్మాసం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇప్పటికే రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు కోర్టుల్లో మరోసారి చుక్కెదురు కావడం గమనార్హం.
దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..
సీజేఐ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం పెడచెవిన పెట్టారని, ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది కాబట్టి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రమేశ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సదరు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ నిలిపేసేలా స్టే ఉత్తర్వులు ఇవ్వాలంటూ జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. స్టే కు నో చెబుతూ.. ఏపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కావాలనే స్టే ఇవ్వట్లేదు..
‘‘ఈ కేసు గురించి ప్రతి చిన్న విషయం మాకు తెలుసు. అందుకే, కావాలనే స్టే ఇవ్వట్లేదు. గవర్నర్ లేఖ పంపిన తర్వాత కూడా రమేష్ కుమార్కు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? గవర్నర్ ఆదేశాలిచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ''అంటూ సీజేఐ తీవ్రస్వరంతో ప్రశ్నలు కురిపించారు. ఇప్పటికే కోర్టుల్లో పలు మార్పు దెబ్బతిన్న ఏపీ సర్కారుకు ఇది మరో షాక్ లాంటిదేననే అభిప్రాయం వ్యక్తవమవుతున్నది.
వారం గడువిచ్చిన సుప్రీం..
విచారణ సందర్భంగా.. రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికార వైసీపీకి చెందిన నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, కోర్టుల్ని అవమానపర్చేలా వ్యవహరించారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది సుప్రీంబెంచ్ కు వివరించారు. దీనిపైనా సుప్రీం బెంచ్ తీవ్రంగా స్పందించింది. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్ల ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ తనకు అందజేయాలని కోరింది. చివరికిగా, ఏపీ హైకోర్టులో జరగబోయే పరిణామాలపై తదుపరి అఫిడవిట్ దాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరఫు లాయర్ కోరగా,అందుకు సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది.
Recommended Video
ఆర్టికల్ 243తో గవర్నర్కు..
నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ, గడువు పూర్తయిందనే మిషతో కొత్త కమిషనర్గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ తీర్పుపై ఏపీ సర్కారు స్టే కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డను ఎస్ఈసీగా తిరిగినియమించాల్సిందేనన్న హైకోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఆ అధికారం గవర్నర్కే ఉంటుందని చెప్పడంతో, నిమ్మగడ్డ మొన్న సోమవారం గవర్నర్ను కలిసి తనను తిరిగి పదవిలో నియమించాలని కోరారు. రెండ్రోజుల తర్వాత (22న) నిర్ణయం తీసుకున్న గవర్నర్.. నిమ్మగడ్డనే ఎస్ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు.
మళ్లీ ఏపీ హైకోర్టులో బంతి..
అటు ఇటు తిరిగి నిమ్మగడ్డ వ్యవహారం మళ్లీ ఏపీ హైకోర్టుకే చేరడం గమనార్హం. జగన్ సర్కారుపై కోర్టు ధిక్కరణ కింద విచారణ చేపట్టవచ్చంటూ సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేయడంతో సీన్ మొత్తం మళ్లీ ఏపీ హైకోర్టుకు మారింది. శుక్రవారమే దీనిపై విచారణ ఉండగా, న్యాయ స్థానం ఏం చెబుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇన్ని ఎదురుదెబ్బల నేపథ్యంలో నిమ్మగడ్డపై ఏపీ సర్కారు తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నవనేదీ ఆసక్తికరంగా మారింది.
ఏపీ రాజధాని మార్పు: రంగంలోకి మోదీ! - గవర్నర్కు పీఎంవో కాల్?.. ఇటు హైకోర్టూ కీలక ఆదేశాలు..