రేషన్ వాహనాలపై వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ- వైసీపీ సర్కారుకు భారీ ఊరట
ఏపీలో వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. గతంలో ఎస్ఈసీ విధించిన ఆంక్షలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది.
ఏపీలో స్ధానిక సంస్ధలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ది చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
రేషన్ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరఫు న్యాయవాదులు, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో హైకోర్టు పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో స్ధానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తుందన్న అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లే అవకాశం దక్కింది.