నిమ్మగడ్డకు అవమానం -ఆఫీసులో ఉన్నా, పీఎస్కు లేఖ -ప్రతీకారంగా ఎస్ఈసీ సంచలన ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు.. పరువు-ప్రతిష్టల వ్యవహారంగా గోచరిస్తున్నాయి. ఇంకొద్ది గంటల్లో నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంతంగా వ్యవహరిస్తుండగా... ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తోన్న జగన్ సర్కారు.. ఎస్ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసి, ప్రత్యక్షంగా అవమానించినంత పనిచేసింది. దీనికి ప్రతీకారంగా ఎస్ఈసీ మరికొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు...
Recommended Video
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసు
అసలేం జరిగిదంటే..
పంచాయితీ ఎన్నికలకు సంబంధించి శనివారం నాడు తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులతో శుక్రవారం సమావేశం కావాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఆ మేరకు ఆదేశాలు జారీచేసినా పంచాయితీరాజ్ శాఖ ముఖ్య అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్లు భేటీకి డుమ్మాకొట్టారు. ఈ చర్యను తీవ్రంగా భావించిన ఎస్ఈసీ.. రాత్రిలోగా తనను కలవకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మరోసారి హెచ్చరించారు. ఇక చేసేదేమీలేక సదరు అధికారులు.. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లారు. కానీ..
నిమ్మగడ్డ ఆఫీసులోనే ఉన్నా..
ఎన్నికల ప్రక్రియకు ఎవరు అడ్డుతగిలినా హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటానని నిమ్మగడ్డ పలుమార్లు హెచ్చరికలు చేశారు. ఆ క్రమంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు సహా 9మంది అధికారులపై బదిలీ వేటుకు ఆదేశాలిచ్చారు. కానీ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఇక ఎస్ఈసీ డెడ్ లైన్ మేరకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియపై మాట్లాడేందుకుగానూ పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం పొద్దుపోయిన తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో నిమ్మగడ్డ తన కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ.. ద్వివేది, గిరిజాలు ఆయనను ఆయన్ను కలవలేదు..
సర్కారు చర్యతో ఎస్ఈసీ ఆగ్రహం..
ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి కూడా నిమ్మగడ్డను కలవకపోవడం ఒక ఎత్తయితే.. నోటిఫికేషన్ విషయంలో తాము చెప్పదల్చుకున్న విషయాన్ని లేఖలో పొందుపర్చిన అధికారులు.. ఆ లేఖను నిమ్మగడ్డ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) శ్రీనివాస్కు అందజేసి, అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ చర్య తనను అవమానించడానికే చేసుంటారని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, ఇదే అధికారులు ఎస్ఈసీకి పంపిన నోట్ లోనూ ఎన్నికలు వాయిదా వేయాలని, వ్యాక్సినేషన్, పోలింగ్ ఒకే సారి సాధ్యపడవని, సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున శనివారం నాటి నోటిఫికేషన్ ప్రకటనను వాయిదా వేసుకోవాలని కోరారు. ఎన్నికల వాయిదా కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీ రాజ్ శాఖ రాసిన లేఖను ఎస్ఈసీ తిరస్కరించినట్లు సమాచారం. అందుకు నిదర్శనంగా కొద్ది సేపటి కిందటే ఎన్నికలపై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు జారీ చేశారు..
25కల్లా ఓటరు జాబితా సిద్ధం..
సర్కారు నుంచి సరైన సహకారం అందడంలేదని ఆరోపిస్తోన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు వేగవంతం చేశారు. ఈ నెల 25 కల్లా తాజా ఓటర్ల జాబితా సమర్పించాలని పంచాయతీరాజ్శాఖకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితా సమర్పణకు ఆదేశించారు. అంతేకాదు, ఈ నెల 25 కల్లా జిల్లా పంచాయతీ అధికారులు ఎన్నికలకు నిధులు విడుదల చేయాలని కూడా నిర్దేశించారు. ఇక..
జగన్ సర్కారుపై నిమ్మగడ్డ ఫైర్..
ఎన్నికల నిర్వహణకు పంచాయతీ రాజ్శాఖ కమిషనర్ సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆరోపించారు. పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ఎన్నికలకు సహకరించడం లేదన్నారు. ఎన్నికలపై హైకోర్టుకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘింస్తోందని ఎస్ఈసీ మండిపడ్డారు. అంతేకాదు.. కోర్టు ఉల్లంఘనలపై విడిగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఎస్ఈసీ కార్యాలయం నుంచి వెలువడే ఆదేశాలను పాటించడానికి అన్నిజిల్లాల సిద్ధంగా ఉండాలని, పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అధికారుల బదిలీ కుదరదని నిమ్మగడ్డకు షాకిచ్చిన ప్రభుత్వం.. తాజా ఉత్తర్వులనైనా పట్టించుకుంటుందా? శనివారం నోటిఫికేషన్ తర్వాతైనా సర్కారు స్టాండ్ మారుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.
నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ -సీఎం జగన్ ప్రతివ్యూహాలు -ఏజీతో భేటీ -ఏపీలో ఏం జరగబోతోంది?