గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ- పెద్దిరెడ్డి ఎపిసోడ్, ప్రివిలేజ్ కమిటీపై ఫిర్యాదు
ఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఇవాళ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన సమావేశంలో తాజాగా చోటు చేసుకున్న పలు పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి ఎపిసోడ్తో పాటు ప్రివిలేజ్ కమిటీ వ్యవహారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో 2019 ఓటర్ల జాబితాతోనే పంచాయతీ పోరు- రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై గతంలో నిమ్మగడ్డ రమేష్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయడం, అనంతరం సాగుతున్న ప్రివిలేజ్ కమిటీ విచారణ వంటి అంశాలను నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పెద్దిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు, తాను ఇచ్చిన ఆదేశాలు, వాటిపై హైకోర్టు తీర్పును కూడా నిమ్మగడ్డ గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది.
అలాగే రేపు రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏర్పాట్లను కూడా గవర్నర్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వివరించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన గవర్నర్కు తెలిపారు. తాను ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి కొందరు రిటర్నింగ్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడాన్ని కూడా ఎస్ఈసీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం