నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్- ఏకగ్రీవాలకు చెక్ ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్లుగానే ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తూ ఇవాళ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఐజీ సంజయ్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా వెంటనే విధుల్లో చేరిపోయారు.
ఏపీలో గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం బెదిరింపులకు దిగడం ద్వారా ఏకగ్రీవాలకు ప్రయత్నించే అవకాశం ఉందన్న సమాచారంతో వాటికి అడ్డుకట్టే వేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని నిన్న పేర్కొన్నారు. అన్నట్లుగానే ఇవాళ ఐజీ సంజయ్కు ఎన్నికల్లో అక్రమాల నియంత్రణ బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ఐజీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎన్ సంజయ్ ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసి ఛార్జ్ తీసుకున్నారు. ఏకగ్రీవాల విషయంలో అక్రమాలు, బెదిరింపులను అడ్డుకునేందుకు సంజయ్ సేవలను ఎస్ఈసీ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సెలవు రోజైనప్పటికీ బాధ్యతలు స్వీకరించిన సంజయ్.. రేపటి నుంచి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. సంజయ్ నియామకం ద్వారా ఈసారి అక్రమాల నివారణ విషయంలో ఎస్ఈసీ సీరియస్గా ఉన్నట్లు అర్ధమవుతోంది.