పంచాయతీ పోరు సక్సెస్- సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ అభినందనలు- అరుదైన దృశ్యాలు
ఏపీలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన పంచాయతీ ఎన్నికల పోరు తొలిదశ దాటింది. ఓ దశలో అసలు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న పరిస్ధితి నుంచి ఇప్పుడు రెండోదశ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో ఎన్నికలు విజయవంతం కావడం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ విజయవంతం అయ్యేందుకు సహకరించిన అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నారు. ఇవాళ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికలు విజయవంతం చేసిన సీఎస్, డీజీపీలకు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ ప్రక్రియను నిర్వర్తించే క్రమంలో ఎదురైన లోటుపాట్లను వారు నిమ్మగడ్డతో పంచుకున్నారు.
ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో భేటీ సందర్భంగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని వీరిద్దరూ, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో సహకరించడంతో నిమ్మగడ్డ కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సందర్భంగా ఎదురైన పరిస్ధితులను నిమ్మగడ్డ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్టీల రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నికల ప్రక్రియలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.