జగన్ పై మరో పోరుకు సిద్ధమైన నిమ్మగడ్డ- తన ఉద్యోగులను సీఐడీ వేధిస్తోందంటూ హైకోర్టుకు...
ఏపీ ఎన్నికల కమిషనర్ పదవి కోసం జగన్ సర్కారుతో అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. గతంలో సీఐడీ తన ఉద్యోగులపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తన ఉద్యోగులపై సీఐడీ పెట్టిన కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఓ ఎత్తయితే అసలు ఈ కేసు దాఖలు వెనుక ఉన్నది వైసీపీ పెద్దలే కావడంతో రమేష్ కుమార్ దీన్ని మరోసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా అనే వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే మరోసారి హైకోర్టు వేదికగా జగన్ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు రాజకీయంగా సెగలు పుట్టించడం ఖాయమైనట్లే..
మరో పోరుకు నిమ్మగడ్డ..
ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వం తనను అర్ధాంతరంగా ఆర్డినెన్స్ ద్వారా తొలగించడాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆత్మవిశ్వాసంగా కనిపిస్తున్నారు. తన కార్యాలయంలో చేసిన మార్పులపై మీడియా కథనాలు కావడంతో వీటిపై విచారణకు కూడా ఆదేశించారు. ఇప్పుడు తన కార్యాలయంలో ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసు విషయంలో హైకోర్టులో మరో పోరాటానికి ఆయన తెరలేపారు. సీఐడీ తన కార్యాలయ ఉద్యోగులను కావాలనే వేధిస్తోందని ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పుడు మరో చర్చకు కారణమవుతోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన లేదు.
సీఐడీ కేసు పూర్వాపరాలివే....
గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక సంస్ధల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయడంపై అధికార వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఆయనపై విమర్శలకు దిగడంతో కింది స్ధాయి నేతలు కూడా సోషల్ మీడియాతో పాటు బహిరంగంగానూ బెదిరింపులకు దిగారు. ఇదంతా కొనసాగుతుండగానే ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. అదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ రాశారు.
ఈ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆయన దాన్ని తెప్పించుకుని కేంద్రానికి పంపారంటూ వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. చివరికి ఈ లేఖ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగమేనంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో ఎన్నికల కమిషన్లో సహాయ కార్యదర్శిగా ఉన్న సాంబమూర్తిని సీఐడీ పలుమార్లు విచారించింది. అసలు నిమ్మగడ్డ కేంద్రానికి పంపిన లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఆయనే స్వయంగా రాశారా లేక ఎవరైనా పంపారా అనే కోణాల్లో విచారించింది. చివరికి ఆయన కంప్యూటర్తో పాటు పలు ఆఫీసు పరికరాలు, దస్త్రాలను సీజ్ చేసింది. విచారణ పేరుతో పలుమార్లు ఆయన్ను రప్పించింది. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిపైనే నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు.
సాయిరెడ్డి ఫిర్యాదుతోనే కేసు..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి సీఐడీకి చేసిన ఫిర్యాదుతోనే ఈ వ్యవహారం మొదలైంది. కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖను జీర్జించుకోలేని వైసీపీ అప్పట్లో ఇలా తమ చేతుల్లోని సీఐడీతో ఇలా కేసు పెట్టించిందన్న చర్చ సాగింది. చివరికి కేంద్రమే ముందుకు వచ్చి నిమ్మగడ్డ కోరిన భద్రతను కల్పించింది. నిమ్మగడ్డకు అదనపు భద్రత అయితే లభించింది కానీ కేసు మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. నిమ్మగడ్డ ఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంటుందని అంతా భావించినా అలా జరగలేదు. దీంతో ఈ కేసును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తనపై కక్షసాధించవచ్చేనే అనుమానంతోనే నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించి ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది.
Recommended Video
జగన్ వెనక్కి తగ్గుతారా?
ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తాము తొలగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి న్యాయప్రక్రియ ద్వారా తిరిగి ఆ స్ధానంలోకి వచ్చేశారు. ఇప్పట్లో ఎలాగో ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదు. బీహార్ ఎన్నికల నిర్వహణ చూసిన తర్వాతే స్దానిక ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆ లోపు నిమ్మగడ్డ పంపే నివేదికలే వారికి ఆధారం అవుతాయి. అయినా ఓసారి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరిగి ఆయన్ను కానీ ఆయన కార్యాలయంలోని సిబ్బందిని కానీ పాత కేసుల పేరుతో ఇబ్బంది పెట్టే చర్యలు ఎలాంటి సంకేతాలు ఇస్తాయన్న చర్చ నడుస్తోంది. దీంతో ప్రభుత్వం సీఐడీ ద్వారా ఈ కేసు ఉపసంహరించుకుంటేనే మంచిదన్న వాదన సాగుతోంది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.