ఆ లేఖ ఎలా లీకైంది? కేంద్రానికి ఫిర్యాదుపై నిమ్మగడ్డ ఏమన్నారు?
కరోనా వార్తల కంటే హాట్ టాపిక్ గా మారిన 'కేంద్రానికి లేఖ' వ్యవహారంపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. స్థానిక ఎన్నికల్లో సీఎం జగన్, ఆయన పార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, హింసాయుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టమని, పారామిలిటరీ బలగాలను మోహరించాలని కేంద్ర హోం శాఖకు ఆయన కోరినట్లుగా వార్తలు ప్రసారమయ్యాయి. ఆయన లెటర్ హెడ్, సంతకంతోనే ఉన్నప్పటికీ సదరు లేఖపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
స్థానిక ఎన్నికల్లో కేంద్రం జోక్యాన్ని కోరుతూ, కేంద్ర బలగాల మోహరింపు కోసం హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారంటూ వచ్చిన వార్తలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ అస్పష్టంగా వివరణ ఇచ్చారు. హోం శాఖ సెక్రటరీకి లేఖ రాసిన మాట వాస్తవం కాదని ఆయన చెప్పారు. అయితే ప్రచారంలో ఉన్న లేఖ వ్యవహారంపై మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరణ తర్వాత ఆయన పేరుతో సర్క్యూలేట్ అవుతోన్న లేఖ ఎవరు లీక్ చేశారు? లేదా ఎవరు తయారు చేశారనేది కీలక అంశంగా మారిది. అక్రమార్కులెవరైనా కమిషనర్ లెటర్ హెడ్, సంతకంతో ఇలాంటి చర్యకు పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుంది. ఆ మేరకు చర్యలు తీసుకునే విషయమై ఆయన స్పందిచంలేదు.
వైసీపీ దాడులు, దౌర్జన్యాల నేపథ్యంలో తాను అమరావతిలో ఉండలేనని, కుటుంబీకులకు కూడా బెందిరింపు కాల్స్ వస్తున్నాయని, హైదరాబాద్ లో ఉండి పనిచేసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఎస్ఈసీ కేంద్రాన్ని వేడుకున్నట్లు లేఖలో వెల్లడైంది. బుధవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయే ముందు.. ఆ లేఖ తాను రాసిందికాదంటూ నిమ్మగడ్డ పొడిపొడిగా చెప్పేసి వెళ్లిపోయారు.