నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
ఏకగ్రీవాలపై వివరణ కోరాం.. ఏదైనా ఎస్ఈసీకి తెలియాల్సిందే..
విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి ఏ అంశమైనా ఎస్ఈసీ పరిధిలోనే ఉంటుందని రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఏకగ్రీవాల ప్రకటనపై సమాచార, ప్రసార శాఖను వివరణ కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసే ఏ అంశమైనా ఎస్ఈసీ దృష్టికి తీసుకురావడం ప్రాథమిక విధి అని సమాచార శాఖకు స్పష్టం చేశారు. ఏకగ్రీవాలు అపరిమితంగా పెరిగితే దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసింది..
రాష్ట్ర పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ సరైన నిర్ణయాలు తీసుకున్నారని నిమ్మగడ్డ తెలిపారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందని చెప్పారు. సీఎస్, డీజీపీతో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. సమన్వయంతో ఎలాంటి పనైనా నిర్వర్తించుకోగలమనే విషయాన్ని గవర్నర్కు తెలిపినట్లు చెప్పారు.
మంత్రి వ్యాఖ్యలు బాధించాయి..
రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయనే నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు నిమ్మగడ్డ తెలిపారు. అధికారులతో తనకు ఎలాంటి సమస్యా లేదని, ఇదే విషయాన్ని తాను గవర్నర్కు కూడా చెప్పినట్లు తెలిపారు. ఎవరి ప్రాపకం కోసమో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నానంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రమేష్ కుమార్ అన్నారు. ఎస్ఈసీకి ఎవరిపైనా కక్ష సాధింపు దోరణి ఉండదని, ఆ అధికారుల పనితీరులో మార్పు ఉంటే పునరాలోచనకూ అవకాశముందన్నారు. ఎస్ఈసీని వ్యక్తిగతంగా నిందించకుండా సంయమనం పాటించాలని కోరారు.
ఎస్ఈసీ విధులకు ఆటంకం కలిగిస్తే కోర్టుకే..
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు దురుసుగా మాట్లాడినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగ సంఘాలతో సన్నిహిత సంబంధాలు నెరిపేవాడినని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులు సహకరిస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో కమిషన్ దృఢంగా వ్యవహరిస్తుందని, ఎస్ఈసీ విధులకు భంగం కలిగితే కోర్టులకు వెళ్లేందుకూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
Recommended Video
సొంతూరులో ఓటు హక్కు ఇవ్వలేమని చెప్పినా..
హైదరాబాద్లోనే ఉన్న ఓటుహక్కును సరెండర్ చేసి తన సొంతూరు దుగ్గిరాల ఓటుహక్కుకు అప్లై చేసినట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు. మీరు దుగ్గిరాలలో ఉండట్లేదు కాబట్టి ఓటుహక్కు ఇవ్వలేమని చెప్పినా.. ఆ తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కలెక్టర్ను తన ఓటుహక్కు కోసం అడుగుతానని తెలిపారు. అప్పటికి ఇవ్వకుంటే తన హక్కు కోసంకోర్టుకు వెళ్తానని తెలిపారు.