హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కు నిమ్మగడ్డ- సింగిల్ బెంచ్ తీర్పు సవాల్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్షన్ విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై నిమ్మగడ్డ హైకోర్టులో సవాల్ చేశారు. ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. ఇవాళ డివిజన్ బెంచ్లో దీనిపై విచారణ జరగబోతోంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం అడ్డంకి కాబోదని, ఇవి కేవలం గ్రామాల్లో జరిగే ఎన్నికలే అంటూ నిమ్మగడ్డ చేసిన వాదనను హైకోర్టు సింగిల్ బెంచ్ పట్టించుకోకపోవడంపై నిమ్మగడ్డ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల నోటిఫికేషన్ సస్పెన్షన్ చెల్లదని ఆయన వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని పిటిషన్ రూపంలో డివిజన్ బెంచ్లో ఆయన దాఖలు చేశారు.
నిన్న సాయంత్రం తర్వాత ఆయన హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకుందని, హైకోర్టు జోక్యంతో జరుపుతున్న ఎన్నికలను మరోసారి అడ్డుకోవాలని చూస్తోందని నిమ్మగడ్డ డివిజన్ బెంచ్లో పెట్టుకున్న పిటిషన్లో ఆరోపించారు. దీంతో హైకోర్టు దీనిపై ఇవాళ విచారణ జరపాలని నిర్ణయించింది. నిన్న సింగిల్ బెంచ్ ఆన్లైన్ విధానంలోనే పంచాయతీ ఎన్నికల పిటిషన్ విచారించగా.. నిమ్మగడ్డ పిటిషన్నూ ఇదే విధానంలో విచారించే అవకాశం ఉంది.