డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీకి నిమ్మగడ్డ - జగన్ సర్కార్పై సీఈసీకి ఫిర్యాదు ?
ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ సర్కారు అడుగడుగునా అడ్డుపడుతోంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో తగిన పరిస్ధితులు లేవని, కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలేంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కు ఇబ్బందికర పరిస్ధితులు తప్పడం లేదు. చివరికి ఎన్నికల నిర్వహణ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించాలని భావించిన వీడియో కాన్ఫరెన్స్ను కూడా ప్రభుత్వం రెండుసార్లు అడ్డుకుంది. దీంతో ఈ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారంలో నిమ్మగడ్డకు సీఈసీ అపాయింట్మెంట్ లభించవచ్చని సమాచారం.
ఏపీలో కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడిన తీరు, ఆ తర్వాత తనను తొలగిస్తూ జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్, అనంరం హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవడం వంటి అంశాలను నిమ్మగడ్డ రమేష్.. సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో హైకోర్టుతో అమీతుమీకి సిద్ధమైన వైసీపీ సర్కారు ఎన్నికల సంఘంతోనూ పోరుకు సిద్ధమవుతుందా లేక ఎన్నికలు నిర్వహిస్తుందా అన్న దానిపై చర్చ సాగుతోంది.