ఆ నాలుగు కార్పోరేషన్లపై నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్- ఐటీ సాయం కోరిన ఎస్ఈసీ - కారణమిదేనా ?
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు జోరుగా సాగిపోతోంది. అదే సమయంలో అదికార వైసీపీతో పాటు పలుచోట్ల బలంగా ఉన్న విపక్షాలు కూడా నోట్ల కట్టలు, లిక్కర్ బాటిళ్లనూ రంగంలోకి దింపుతున్నాయి. దీంతో ఎన్నికల్లో రేపు గెలుపోటములను ఇవే నిర్ణయించే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా కీలక కార్పోరేషన్లలో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న అధికార పార్టీకి ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు.
హోరాహోరీగా మున్సిపల్ పోరు
ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నెల 10న పోలింగ్ ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ఓటర్లతో పాటు అభ్యర్ధులనూ తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇందులో వైసీపీ టీడీపీ కంటే ఓ అడుగు ముందే ఉంది. కీలకమైన కార్పోరేషన్లలో సైతం ఏకగ్రీవాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయా చోట్ల ఏం జరుగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్గా ఉన్నారు. ఎన్నికల్లో ఓటర్లు, అభ్యర్ధులు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలుగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నాలుగు కార్పోరేషన్లపై నిమ్మగడ్డ నజర్
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరులో డబ్బు, మద్యం ప్రవాహాలు భారీగానే ఉన్నా.. నాలుగు కీలక కార్పోరేషన్లలో మాత్రం వీటి ప్రవాహం మరీ తీవ్రంగా ఉన్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ భావిస్తున్నారు. దీంతో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇవాళ్టి నుంచి తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పోరేషన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ప్రకటించారు. ఆయా చోట్ల ఎన్నికల అధికారులను కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎన్నికల కోడ్ పరిశీలించే స్పెషల్ టీమ్లనూ అప్రమత్తం చేస్తున్నారు.
ఐటీ సాయం కోరిన నిమ్మగడ్డ
రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు గెలుపు కీలకంగా మారిన తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పోరేషన్లలో ధన ప్రవాహం భారీగా ఉందని భావిస్తున్న నిమ్మగడ్డ ముందుగా దానిపై దృష్టిపెట్టారు. ఇందుకోసం ఆదాయపు పన్నుశాఖ సాయం కోరారు. ఆయా చోట్ల జరుగుతున్న లావాదేవీల వివరాలను తమతో పంచుకోవాలని నిమ్మగడ్డ ఐటీ అధికారులను కోరారు. దీంతో ఇవాళ్టి నుంచి ఆ సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. దీని ఆధారంగా అభ్యర్ధులను, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
ఆ నాలుగు కార్పోరేషన్లే ఎందుకు?
రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నా అసలు పోరు మాత్రం ఈ నాలుగు కార్పోరేషన్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధాని తరలింపు అజెండా ప్రభావం చూపే అవకాశం ఉండగా.. విశాఖలో స్టీల్ ప్లాంట్ వ్యవహారం కలకలం రేపుతోంది. దీంతో పాటు తిరుపతిలో ఉపఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు వైసీపీ, టీడీపీకీ చావోరేవో అన్నట్లుగా మారిపోయాయి.
ఈ నాలుగు చోట్ల గెలుపు ఆయా పార్టీల భవిష్యత్ సమీకరణాలకు కీలకం కానుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరుతో పాటు విశాఖలోనూ వైసీపీ ఓడితే మూడు రాజధానుల ప్రక్రియను ప్రజలు తిరస్కరించాలని చెప్పుకునే వీలుంది. అలాగే వైజాగ్లో వైసీపీ ఓడితే స్టీల్ ప్లాంట్తో పాటు రాజధాని వ్యవహారంలోనూ ప్రజలు తీర్పు నిచ్చారని టీడీపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ మూడు చోట్లా వైసీపీ గెలిస్తే రాజధానికి ప్రజల ఆమోదం లభించినట్లవుతుంది. మరోవైపు తిరుపతి కార్పోరేషన్ గెలుపు ఉపఎన్నికకు ముందు వైసీపీ, టీడీపీలకు నైతికంగా కీలకంగా కానుంది.