పాత పైలు బయటికి తీస్తున్న నిమ్మగడ్డ- ఆ కలెక్టర్లు, ఎస్పీల మార్పు ఖాయమేనా ?
ఏపీలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కావడంతో తదుపరి చర్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి అవే ఆదేశాలు పంపేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తాను బదిలీ చేయాలని సూచించిన అధికారులను ఈసారి కచ్చితంగా బదిలీ చేయాల్సిందేనని ఆయన కోరబోతున్నారు. దీంతో ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Recommended Video
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆయన పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో గతంలో తాను బదిలీ చేసిన అధికారులను నిమ్మగడ్డ భాగస్వాముల్ని చేయలేదని తెలుస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ స్ధానంలో జాయింట్ కలెక్టర్ను వీడియో కాన్ఫరెన్స్కు పిలిచారు. ఇదే కోవలో మిగతా అధికారులను కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గతంలో తాను బదిలీ చేయాలని సూచించిన అధికారులను తప్పించాలని సీఎస్కు కూడా నిమ్మగడ్డ లేఖ రాయబోతున్నారు.
గతంలో ఎన్నికల అక్రమాలకు ఆస్కారం ఇవ్వడం, చూసీ చూడనట్లుగా వదిలేశారన్న ఆరోపణలపై గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు. అలాగే మాచర్ల సీఐతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరికొందరు అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కానీ ప్రభుత్వం ఎన్నికల వాయిదా వేశారన్న కోపంతో ఆయన ఆదేశాలను అమలు చేయలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఎన్నికల నిర్వహణ అధికారిగా నిమ్మగడ్డ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయక తప్పని పరిస్దితి నెలకొంది.