కొడాలికి నిమ్మగడ్డ మరో షాక్- కేసు నమోదుకు కృష్ణా ఎస్పీకి ఆదేశాలు- హైకోర్టులో పిటిషన్ వేళ
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగుతున్న మంత్రులకు ఎన్నికల కమిషన్ చుక్కలు చూపిస్తోంది. ఎన్నికల వేళ ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని తెలిసినా రాజకీయ విమర్శలు చేస్తున్న మంత్రులు వరుసగా ఎస్ఈసీ ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా మంత్రి కొడాలినానిపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు మరింత కలకలం రేపుతున్నాయి.
నిన్న ఉదయం రేషన్ వాహనాల విషయంలో ప్రత్యర్ధులపై విమర్శల కోసం ప్రెస్మీట్ పెట్టిన మంత్రి కొడాలి నాని అదే క్రమంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పైనా నిప్పులు చెరిగారు. ఆయన చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం తమదేనని, వీళ్లంతా జగన్నాథ రథ చక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమన్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రెస్ మీట్ ముగిసిన గంటలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారు.
అయితే ఎన్నికల కమిషన్పై తనకు గౌరవం ఉందని, తన వ్యాఖ్యలను అపార్ధం చేసుకున్నారంటూ కొడాలి నాని ఇచ్చిన వివరణతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంతృప్తి చెందలేదు. దీంతో ఆయన్ను ఎన్నికలు ముగిసేవరకూ కట్టడి చేయాలని కృష్ణాజిల్లా ఎస్పీ, కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఆదేశాలపై కొడాలి ఇవాళ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమయ్యారు. కోర్టు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయబోతున్నారు. ఆ లోపే కొడాలి నానికి నిమ్మగడ్డ మరో షాక్ ఇచ్చారు. తనతో పాటు ఎన్నికల కమిషన్పై చేసిన వ్యాఖ్యలపై కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణాజిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీకి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.