ఏపీ పంచాయతీ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ విడుదల- 11 జిల్లాల్లోనే
ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్పై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. అనుకున్నట్లుగానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కొద్దిసేపటి క్రితం ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ను విడుదల చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనుండగా.. కేవలం 11 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికలను వాయిదా వేశారు.
Recommended Video
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ మరోసారి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ ప్రకటించింది. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ పోలింగ్ ఉంటుందని నిమ్మగడ్డ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో కమిషన్కు చాలా ఇబ్బందులు ఉన్నాయని, పెను సవాలే అయినా నిర్వహంచి తీరాల్సిందేనని ఆయన తెలిపారు.
ఎన్నికల నిర్వహణ విషయంలో ముందు నుంచీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును, ఇప్పటికీ అధికారుల వ్యవహారశైలిని నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ గుర్తుచేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇందుకు ప్రభుత్వంతో పాటు అధికారులూ సహరించాలని నిమ్మగడ్డ కోరారు. ఎన్నికల విషయంలో ఎలాంటి రాజీపడే ప్రశ్నేలేదన్నారు.