కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి... మిగతా ఉద్యోగుల్లో భయాందోళన...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు కరోనాతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వి.పద్మారావు అనే ఉద్యోగి కోవిడ్ సోకి మృతి చెందారు. పద్మారావుతో కలిసి పనిచేసిన ఉద్యోగుల్లో ఇప్పుడు భయాందోళన నెలకొంది.
సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 50 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. సచివాలయంలో కరోనా ఎఫెక్ట్తో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు విజయవాడ,గుంటూరుల్లోని హెచ్ఓడీ కార్యాలయాల నుంచే పనిచేస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరి ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్నారు.
కాగా,శుక్రవారం(ఏప్రిల్ 16) నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231కి చేరిన సంగతి తెలిసిందే. 24గంటల వ్యవధిలోనే 6096 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది కరోనాతో మృతి చెందడంతో... మొత్తం మరణాల సంఖ్య 7,373కి చేరింది. ఇప్పటివరకూ 9,05,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35, 592 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Recommended Video
కరోనా కట్టడి కోసం ఇప్పటికే గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో లాక్డౌన్ విధించారు. గుంటూరు,విజయవాడ నగరాల్లో వ్యాపారస్తులు ఆదివారం(ఏప్రిల్ 17) స్వచ్చందంగా లాక్డౌన్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సోమవారం(ఏప్రిల్ 19) నుంచి శుక్రవారం(ఏప్రిల్ 30) వరకూ ప్రతీరోజు సాయంత్రం 6గంటలకే షాపులు,వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాబట్టి వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు సహకరించాల్సిందిగా కోరారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతీ వ్యాపార సంస్థ యజమాని, సిబ్బంది, కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, షాపులను శానిటైజేషన్ చేయాలని సూచించారు. మాస్కులు ధరించే కస్టమర్లను మాత్రమే షాపుల్లోకి అనుమతించాలని సూచించారు.