రాజధాని తరలింపుపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సమావేశం: రైతుల కంటే తమకే ఇబ్బంది అంటూ
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక పక్క రాజధాని రైతుల ఆందోళన ఉధృతం అవుతుంటే మరోపక్క సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సచివాలయ ఉద్యోగులు రాజధాని వైజాగ్ కు తరలిస్తున్న నేపధ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యోగుల అభిప్రాయాన్ని కమిటీలు తెలుసుకోలేదని, ఇలా మారటం తమకు ఇబ్బందిగా ఉంటుందని ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు.
అమరావతిలో రుణాలు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కున్నామన్న ఉద్యోగులు
ఇక సచివాలయ ఉద్యోగులు అమరావతిలో రుణాలు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కున్నామని ఇప్పుడు విశాఖ వెళ్లాలంటే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సరిగా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . హైదరాబాద్ నుంచి అమరావతికి రావాలంటేనే చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పిన ఉద్యోగులు ఇప్పుడు ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళమంటున్నారని అన్నారు. రాజకీయ పార్టీల గొడవల మధ్య ఉద్యోగులు బలవుతున్నారని పేర్కొన్నారు.
సచివాలయం ముందు పబ్లిక్ పార్క్లో సమావేశమైన ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై సచివాలయం ముందు పబ్లిక్ పార్క్లో సమావేశమైన ఉద్యోగులు విశాఖకు సచివాలయం తరలింపు నిర్ణయంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమ సంఘాల నేతలతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ..అప్స అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉద్యోగులకు సర్దిచెప్పబోయారు. కానీ మౌఖిక ఆదేశాలు ఇచ్చారన్న విషయంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని మార్పుపై కన్నీటి పర్యంతం
నేతల వ్యాఖ్యలతో నిరాశ చెందిన ఉద్యోగులు అర్ధాంతంరంగా బయటకు వచ్చేశారు. రాజధాని మార్పుపై కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతిలో రుణాలు తీసుకుని ఇళ్లుకొనుక్కున్నామని, మరో ప్రభుత్వం వస్తే విశాఖ నుంచి రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. అప్పుడు అక్కడ నుండి మళ్ళీ ఇటు రావాలా అంటూ వాపోతున్నారు. ప్రభుత్వానికి ఇలా ఉద్యోగులతో ఆడుకోవటం న్యాయం కాదని అంటున్నారు.
జగన్ పునరాలోచించాలని ఉద్యోగుల విజ్ఞప్తి
"రాజధానిని మార్చడంపై రైతుల కంటే ఎక్కువగా ఇబ్బంది పడేది మేము ఉద్యోగులమే " అని వారంటున్నారు . రాజధాని అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ అమరావతిలో తాము ఇళ్లను కొనుగోలు చేశామని కనుక రాజధాని మార్పుపై మరోసారి ఆలోచించాలని ఉద్యోగులు జగన్ను అభ్యర్థిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఏప్రిల్ 6 నాటికి సచివాలయ ఉద్యోగులు షిఫ్ట్ అవ్వాలని అందుకు ఏర్పాట్లు చెయ్యాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.