Executive Capital: డెడ్లైన్..బడ్జెట్ భేటీ: ఆ తరువాతే విశాఖకు: చిక్కులన్నీ వీడిటానికి సమయం...!
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే దిశగా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో జాప్యం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలైన దృష్ట్యా విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించడానికి మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులన్నీ వీడిపోయిన తరువాత.. విశాఖకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనప్రాయంగా సూచించినట్లు సమాచారం.
బడ్జెట్ సమావేశాలు ముగిసే నాటికి..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల చివరివారంలో గానీ లేదా వచ్చేనెల మొదటి వారంలో గానీ నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం త్వరలో ఓ నోటిఫికేషన్ వెలువడనుంది. బడ్జెట్ సమావేశాలు సుమారు నెలరోజుల పాటు కొనసాగించడానికి ఆస్కారం ఉంది. అసెంబ్లీ వర్షాకాలం, శీతకాల సమావేశాలను ఎక్కువ రోజుల పాటు నిర్వహించరు. అందుకే బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత ఉంటుంది. పైగా ప్రభుత్వం శాఖలవారీగా ప్రతిపాదించిన నిధుల కేటాయింపుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉంటుంది.
ఉగాది నాటికి అనుకున్నప్పటికీ..
మొదట- తెలుగు సంవత్సరాది ఉగాది నాడు విశాఖపట్నం నుంచి పరిపాలనను ప్రారంభించాలని ఇదివరకు జగన్ సర్కార్ నిర్ణయించినట్లు వార్తలు విస్తృతంగా వెలువడ్డాయి. దీనిపై అధికార వర్గాల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. వచ్చే నెల 25వ తేదీన ఉగాది పండుగ. ఈలోగా బడ్జెట్ సమావేశాలు ముగిసిపోవడం దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో తీరిక లేకుండా ఉంటూ..
సాధారణంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార యంత్రాంగం తీరిక లేకుండా ఉంటుంది. ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానాలను ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడం వంటి కార్యక్రమాల వల్ల వారి దృష్టి అంతా అసెంబ్లీ సమావేశాలపైనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని తొందర పెట్టి ఉగాది నాటికి విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోలేకపోవచ్చని అంటున్నారు.
ఇంకా అసంపూర్తిగానే..
విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించడానికి అవసరమైన భవనాలు, ఇతరత్రా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈలోగా బడ్జెట్ సమావేశాలు ఆరంభమైతే.. ఆ పనులకు బ్రేక్ పడుతుంది. విశాఖపట్నం-భీమిలీ మార్గంలోని రుషికొండ, మధురవాడ ప్రాంతంలో గల మిలీనియం టవర్ను ఓ రూపానికి తీసుకుని రావాల్సిన పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. మిలీనియం టవర్-బీ నిర్మాణం తుదిదశలో ఉంది. బడ్జెట్ సమావేశాలు ముగిసే నాటికి ఆయా పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ముగించడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. బడ్జెట్ సమావేశాల తరువాత ఏరోజైనా తరలి వెళ్లడానికి సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.