ఏపీ సచివాలయం తరలింపు..ఎక్కడికంటే: ప్రారంభమైన కసరత్తు: త్వరలో అధికారిక నిర్ణయం..!
కొద్ది రోజులు క్రితం ఏపీ రాజధాని అమరావతి నుండి తరలిస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రస్తుతం అది సద్దుమణిగింది. అయితే ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల్లో మాత్రం పెద్దల సూచనల మేరకు కీలక అంశం పైన కసరత్తు జరుగుతోంది. అయితే...ప్రభుత్వ ఆలోచనలు ఏంటనేది స్పష్టంగా బయట పడకపోయినా..ఇప్పుడు సీనియర్ సివిల్ సర్వీసు అధికారులే ముఖ్యమంత్రి వద్ద ఒక కీలక ప్రతిపాదన చేసారు. దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయంను అక్కడి తరలించాలనేది ఆ సమావేశ సారాంశం. ఎక్కడకు తరలిస్తే బాగుంటుందనే దాని పైన చర్చ జరిగింది. అదే సమయంలో మరి కొన్ని కార్యాలయాలను సైతం తాజాగా నిర్ణయించిన ప్రాంతానికి తరలించే ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్దకు వచ్చింది. అయితే.. ప్రభుత్వంలోని ముఖ్యులు.. మంత్రులతో చర్చించిన తరువాత దీని పైన ముఖ్యమంత్రి అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
సచివాలయం తరలింపు..
ఏపీ ప్రభుత్వం వద్దకు కొత్త ప్రతిపాదన వచ్చింది. రాజధాని ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగిస్తూ.. వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని మాత్రం తరలించాలని కొందరు సీనియర్ అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. అందు కోసం వారు రాజధాని నుండి తరలించారనే ఆరోపణలకు తావు లేకుండా మంగళగిరికి తరలించాలని సూచన చేసారు. మంగళగిరి ప్రాంతం సచివాలయానికి ఎలా అనుకూలమైనదో వివరిస్తూ ఒక నివేదికను కూడా వారు ఆయనకు అందచేసినట్లు తెలుస్తోంది. సీనియర్ అధికారుల నుండే ఈ ప్రతిపాదన రావడంతో సిఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. అయితే అధికారిక నిర్ణయానికి మాత్రం మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
వెలగపూడిలో ఎందుకు వద్దంటే..
ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయం విజయవాడకు 18 కిలోమీటర్లు, గురటూరుకు 25 కిలోమీటర్లు, మంగళగిరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు ప్రారతాల నురచి ప్రతి రోజూ సచివాలయానికి రావడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. డబ్బులు ఖర్చు కావడమేగాక శారీరక శ్రమ కారణంగా సచివాలయానికి వెళ్లేటప్పటికే అలసిపోతున్నామని, విధి నిర్వహణపై దృష్టి సారించలేకపోతున్నామని అంటున్నారు.
దీనికి తోడు హెచ్ ఓడీలు విజయవాడ శివార్లు..గుంటూరులో ఉండటం వలన సమాచార మార్పింది...సమీక్షలకు సమన్వయం కుదరటం లేదని అధికారులు ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో వివరించారు.
900 కోట్లు ఖర్చు చేసినా...ఉండే పరిస్థిలి లేదంటూ..
చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో 900 కోట్ల రూపాయతో సచివాలయం నిర్మించిన ప్పటికీ, అధికారులు. ఉద్యోగుల కోసం తలపెట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తికాక పోవడాన్ని, నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత పనులను పూర్తిగా ఆపేసిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
ఒకవేళ నిర్మాణాలు పూర్తయినా, పూర్తి స్థాయిలో వసతులు లేని ప్రాంతంలో ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి స్థిరపడటంపై అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే అన్ని సౌకర్యాల తో, రాకపోకలకు అనుగుణంగా ఉన్న మంగళగిరి ప్రాంతాన్ని వారు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వం సైతం కొద్ది రోజుల క్రితం నుండి జాతీయ రహదారి వెంబటి స్థలాలు..మంగళగిరి..ఉండవల్లి ప్రాంతాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు అధికారుల నుండి వచ్చిన ప్రతిపాదన పైన లోతుగా అద్యయనం చేసే అవకాశం ఉంది.
కీలక కార్యాలయాలు మంగళగిరికి...
కొన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను సైతం మంగళగిరికి తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. గుంటూరులో ఉన్న పట్టణాభివృద్ధి, అటవీ శాఖ అదే విధంగా..గొల్లపూడిలో ఉన్న రెవెన్యూ, భూ పరిపాలన ముఖ్య కమిషనర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను కూడా మంగళగిరికి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇతర శాఖల అధికారులు కూడా తమ కార్యాలయాలకోసం మంగళగిరి పరిసరాల్లో భవనాలను వెదుక్కునే పనిలో నిమగమయ్యారు. అయితే, ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం పైన అన్ని స్థాయిల్లో చర్చలు చేసిన తరువాత అధికారికంగా నిర్ణయం ప్రకటించనుంది.