కరోనా నిరోధానికి మేము సైతం అంటున్న డ్వాక్రా మహిళలు- పోలీసు, వైద్యుల కోసం లక్షలాది మాస్కుల తయారీ..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో మేము సైతం అంటున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు.. ఇప్పుడు కరోనా విపత్తుకు తమ వంతుగా మాస్కులను అందించాలని నిర్ణయించాయి. వివిధ జిల్లాల్లో ఉన్న పేద మహిళలు తమ సంఘాల తరఫున కరోనాపై పోరాడుతున్న పోలీసు, వైద్య సిబ్బందికి ఈ మాస్కులను అందించనున్నాయి.
కరోనాపై పోరులో మాస్కుల కొరత..
ఏపీలో కరోనా వ్యాప్తి కాకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఇందులో పోలీసులు, వైద్య సిబ్బంది తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పోలీసులు లాక్ డౌన్ అమలుకు రోడ్లపై శ్రమిస్తుండగా... ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే రాష్ట్ర్రంలో నాణ్యమైన మాస్కుల కొరత ఉండటంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా పోరాటంలో మేము సైతం..
ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాడుతున్న పోలీసులు, ఆరోగ్య సిబ్బందికి తీవ్రమైన మాస్కుల కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి స్వయం సహాయక ఉత్పత్తులను పక్కనబెట్టి మరీ మాస్కుల తయారీకి మహిళలు శ్రమిస్తున్నారు. ఆయా సంఘాల్లోని పేద మహిళలంతే ఇళ్ల వద్దే ఉంటూ రోజూ వందల సంఖ్యలో మాస్కులను కుట్టు మిషన్లపై తయారు చేస్తున్నారు. వీటిని పోలీసులు, ఆరోగ్య, వైద్య సిబ్బందికి అందించేలా అధికారులకు ప్రతిపాదనకు పంపారు. వీటిని ప్రభుత్వం కూడా ఆమోదించింది.
కేంద్రం కూడా చేతులెత్తేసిన వేళ..
వాస్తవానికి కరోనా వైరస్ ప్రభావాన్ని గుర్తించి లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను చేయడంలో మాత్రం వెనుకబడింది. వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్న సిబ్బందికి క్లిష్ట పరిస్ధితుల్లో క్లినికల్ మాస్కులను అందించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్ధలపై ఆధారపడాల్సిన పరిస్దితి. ఇలాంటి తరుణంలో ఏపీలో స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్కుల పంపిణీతో ఈ సమస్యకు కొంతవరకైనా పరిష్కారం లభించినట్లవుతోంది.
త్వరలో అందుబాటులో భారీగా మాస్కులు..
ప్రస్తుతం అధికారుల ప్రోత్సాహంతో భారీ ఎత్తున మాస్కుల తయారీకి పూనుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలు.. ఈ వారాంతం నాటికి లక్షల సంఖ్యలో వీటిని సిద్ధం చేయనున్నారు. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైద్యలు, పోలీసులతో పాటు సాధారణ ప్రజలకు కూడా వీటిని అందజేసేందుకు వీలు కలుగుతుంది.