రూ.8 వేల కోట్లతో రిజర్వాయర్;బొల్లాపల్లి అటవీ ప్రాంతంలో నిర్మాణం: మంత్రి పత్తిపాటి
గుంటూరు జిల్లా: ప్రపంచ బ్యాంకు నిధులు 8 వేల కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం అటవీ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వినుకొండలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
ఈ ప్రాజెక్టును వచ్చే ఎన్నికల్లోపు చేపట్టేందుకు అనుగుణంగా ప్రతిపాదనలను సిద్దం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని పుల్లారావు వివరించారు. ఈ రిజర్వాయర్తో పల్నాడు ప్రాంతంలో తాగు, సాగు నీటి సమస్యను అధిగమిస్తామని చెప్పారు. అంతేకాకుండా దీని ద్వారా లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఏడాదికి రెండు మూడు పంటలు పండించొచ్చని పుల్లారావు అన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి విడత రూ.3500 కోట్లు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికీ నదుల నుంచి 3 వేల టిఎంసిల నీరు సముద్రంలో కలిసి వృథా అవుతున్న దృష్ట్యా గోదావరి, పెన్నా నదులను అనుసందానం చేసేందుకు సిఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని పుల్లారావు చెప్పారు. అయితే కనీసం 1000 టిఎంసిల నీరు నిల్వ చేసినా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో నీటి కొరత ఉండదని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి నీరు రాకున్నా తక్కువ నీరుతో సాగు, తాగు అవసరాలు తీర్చగలిగామని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు.