మరో రికార్డుకు జగన్ రెడీ- వారం రోజుల్లో 26778 ఉద్యోగాలు- ఆగస్టు 6 కల్లా విధుల్లోకి...
ఏపీలో గతంలో గ్రామ సచివాలయాల్లో లక్షా 27 వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో దేశంలోనే కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించిన సీఎం జగన్ మరోసారి ఇలాంటి తరహా ఫీట్ కు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రైవేటు సంస్దలు ఉద్యోగాల కోతలు విధిస్తున్న వేళ ప్రభుత్వం మాత్రం భారీ స్ధాయిలో 26778 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అదీ వారం రోజుల్లోనే కావడం మరో విశేషం. ఈ మేరకు కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఆగస్టు 6 కల్లా నియామకాలు పూర్తి చేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది.
ఏపీ సర్కార్.. వాట్ నెక్స్ట్: కేంద్రం ఝలక్: ఆ పథకానికి బ్రేక్ పడినట్టేనా?: జగన్ స్పందనేంటీ?
మరో భారీ జాబ్ మేళా...
ఏపీలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా భారీగా టెస్టులు నిర్వహిస్తోంది. ఎలాంటి భేషజాలకు పోకుండా భారీగా కేసులు నమోదవుతున్నట్లు కూడా హెల్త్ బులిటెన్లలో చెబుతోంది. మరికొన్నాళ్లు ఇదే పరిస్ధితి ఉండబోతోందని కూడా సంకేతాలు ఇచ్చేస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో మరో భారీ డ్రైవ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా పరిస్ధితుల్లో ప్రభుత్వంపై ఇది భారమే అయినా లెక్కచేయకుండా 26778 ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించింది.
భర్తీ చేసే ఉద్యోగాలివే...
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నియమిస్తున్న వారిలో మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు ఇలా మొత్తం 26,778 మంది ఉన్నారు. వీరందరినీ ఆరు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు. భారీగా వేతనాలు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గరిష్టంగా స్పెషలిస్టు డాక్టర్లకు నెలకు లక్షన్నర వేతనం కూడా ఇవ్వబోతున్నారు. వీరందరికీ కోవిడ్ ఆస్పత్రుల్లో పోస్టింగ్స్ ఇస్తారు. ఈ 26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే ప్రభుత్వం 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. కరోనా వైద్య సేవలతోపాటు, రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
Recommended Video
వారం రోజుల్లోనే ప్రక్రియ పూర్తి...
గతంలో ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతున్న ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ రికార్డు స్ధాయిలో వారం రోజుల్లోనే పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5 వరకూ ఈ పోస్టుల నియామకం కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయడం, ఇంటర్వూలు నిర్వహించడం, సామర్ధ్యాన్ని పరీక్షించడం, మెరిట్ జాబితాలు తయారు చేయడం, పోస్టుల భర్తీ చేయడం పూర్తవుతుంది. ఆగస్టు 6న వీరంతా విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ పెట్టబోతున్నారు. ఆగస్టు 6 కల్లా వీరి నియామకం పూర్తి చేసి మధ్యాహ్నం 12 గంటల కల్లా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కు వివరాలు పంపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.